పటేల్ బుజ్జగింపు: అవిశ్వాసంపై ఎంపీలు ససేమిరా
న్యూఢిల్లీ: యుపిఎ ప్రభుత్వంపై తమ పార్టీకి చెందిన ఆరుగురు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రంగంలోకి దిగారు. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన ఆదేశించారు.
అయితే, వెనక్కి తగ్గడానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు నిరాకరిస్తున్నారు. లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి, రాయపాటి సాంబశివ రావు, హర్షకుమార్, సాయి ప్రతాప్ యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు స్పీకర్ మీరా కుమార్కు నోటీసు ఇచ్చారు. అదే సమయంలో వారు తాము చేసిన రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు.
కాంగ్రెసు అధిష్టానానికి తమ సొంత పార్టీ పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం అనూహ్యమైన పరిణామమే. అయితే, గత కొద్ది రోజులుగా లగడపాటి రాజగోపాల్ ఆ విషయం చెబుతూనే ఉన్నారు. మిగతా సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల్లో ఎంత మంది వారితో కలిసి వస్తారనేది సందేహమే. ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన ఆరుగురు ఎంపీలు కూడా కరుడుగట్టిన సమైక్యవాదులుగానే వ్యవహరిస్తున్నారు.
తమ పార్టీ పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం వెనక ఎవరున్నారనే విషయంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. ఆ ఆరుగురిపై కూడా సోనియా గాంధీ ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. వారి వెనక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారనే మాట వినిపిస్తోంది. తమకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మద్దతు ఉందని స్వయంగా సబ్బం హరి చెప్పారు.