అహ్మద్ పటేల్ ఫ్యామిలీకి ఈడీ కష్టాలు: మనీలాండరింగ్ కేసులో కొడుకు, అల్లుడు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారుగా వ్యవహరించిన అహ్మద్ పటేల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కష్టాలు ఎదువుతున్నాయి. ఓ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ను ఈడీ ప్రశ్నించినపుడు అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్దిఖీ పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది.
వడోదరా కేంద్రంగా పనిచేస్తున్న సందేశార గ్రూప్పై మనీ లాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ సునీల్ యాదవ్ను ప్రశ్నించింది. సునీల్ ఇచ్చిన లిఖితపూర్వక సాక్ష్యంలో సందేశార గ్రూప్ యజమాని చేతన్ సందేశార, ఆయన సహచరుడు గగన్ ధావన్ భారీ మొత్తంలో సొమ్మును ఇర్ఫాన్ సిద్ధిఖీకి ఇచ్చినట్లు ఆరోపించారు.
చేతన్ సందేశార తరపున భారీ నగదును ఫైజల్ పటేల్కు పంపించినట్లు తెలిపారు. చేతన్ సందేశార తరచూ అహ్మద్ పటేల్ నివాసానికి వెళ్ళేవారని కూడా సునీల్ తెలిపారు. న్యూఢిల్లీలోని 23,మదర్ క్రెసెంట్లో అహ్మద్ పటేల్ నివాసం ఉంది. దీనిని సందేశార ప్రస్తావించినపుడు, 'హెడ్క్వార్టర్స్ 23' అని అభివర్ణించేవారని సునీల్ పేర్కొన్నారు.
అంతేగాక, సిద్ధిఖీని జే2 అని, ఫైజల్ను జే1 అని సంబోధించేవారని పేర్కొన్నారు. సునీల్ ఇచ్చిన స్టేట్మెంట్ను మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం నమోదు చేశారు. అందువల్ల దీనిని కోర్టులో సాక్ష్యంగా అనుమతిస్తారు. దీంతో సిద్ధిఖీ, ఫైజల్పై కూడా ఎన్ఫోర్స్ముంట్ డైరెక్టరేట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.