అనాథ పిల్లల కోసం స్కూళ్లు.. ట్రాఫిక్ పోలీసుల ఔదార్యం..!
అహ్మదాబాద్ : అనాథ పిల్లలు, నిరాశ్రయులైన చిన్నారుల కోసం ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. రోడ్లపై భిక్షాటన చేస్తూ, ఫుట్పాత్లపై నిద్రించే చిన్నారులను చేరదీసి వారిని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో పాఠశాలలు పెట్టి వారికి విద్యాబుద్దులు నేర్పిస్తున్నారు. అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ వినూత్న ప్రయోగానికి మంచి ఆదరణ లభిస్తోంది.
ఫుట్పాత్లపై ఉంటూ కాలం వెళ్లదీస్తున్న ఎంతోమంది అనాథ, నిరాశ్రయులకు విద్యాబుద్దులు నేర్పించడమే లక్ష్యంగా అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెరపైకి తీసుకొచ్చిన ఈ ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తోంది. సరిగ్గా ఏడాదిన్నర కిందట అంకురార్పణ జరిగిన పోలీస్ పాఠశాల నేడు మూడు స్కూళ్లకు దారి తీసింది.
కంకారియా, దానిల్ మిందా, పక్వన్ ప్రాంతాల్లో పోలీస్ పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ మూడు స్కూళ్లల్లో దాదాపు 200 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. కొంతమంది టీచర్లను నియమించి వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. అంతేకాదు ట్రాఫిక్ డ్యూటీలు లేనప్పుడు పోలీసులు సైతం అక్కడి విద్యార్థులకు చదువు చెబుతున్నారు. ఇక పిల్లలను ఇంటి నుంచి బడికి.. బడి నుంచి ఇంటికి పంపే వీలుగా కొన్ని రిక్షాలను కూడా ఏర్పాటు చేయడం విశేషం. చదువు, రవాణా సౌకర్యమే కాదు.. మధ్యాహ్నం పూట ఫ్రీ భోజనం పెట్టించడం మరో ప్రత్యేకత.
రాములమ్మ ఎంట్రీ.. గులాబీ, కమలం మధ్య చేయి.. విషయం అదేనా?
Gujarat: Ahmedabad City Traffic Police imparts free education to children residing on footpaths under their project called 'Police Pathshala'. Around 150-200 children are getting education in three centers across the city. pic.twitter.com/YydKzeKMrJ
— ANI (@ANI) August 21, 2019
ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న పోలీస్ పాఠశాలలను స్థానికులు అభినందిస్తున్నారు. మానవతాదృక్పథంతో వారు చేపట్టిన సేవాకార్యక్రమం భేష్ అంటూ కితాబిస్తున్నారు. అనాథ, నిరాశ్రయులైన పిల్లలను చేరదీసి వారికి విద్య అందించడం అనేది అంతా ఈజీ కాదని.. ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ఎందరికో స్ఫూర్తిదాయకమని అంటున్నారు అధికారులు. ఫుట్పాత్పై ఉండే పిల్లలకు కూడా మంచి విద్యను అందించాలనే సత్ సంకల్పంతో ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెబుతున్నారు ట్రాఫిక్ డీసీపీ అంకిత్ పటేల్.