తమిళనాటకీయం: అన్నాడీఎంకే పొత్తు ఎవరితో... బాంబు పేల్చిన పన్నీర్ సెల్వం
చెన్నై: కొన్ని నెలల క్రితం తమిళనాడు రాజకీయాలు కాక మీద ఉన్నట్లు కనిపించాయి. ఒక్కసారిగా పొలిటికల్ హీట్ తగ్గినట్లుంది. తమిళనాడు ప్రభుత్వంను పడగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నించారు దినకరన్. ఇక కొన్నిరోజులకు అన్నీ సర్దుకున్నాయనుకుంటున్న సమయంలో డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మరో బాంబు పేల్చారు. పన్నీర్ సెల్వం చెప్పిన విషయాలేంటి... ఆయన పేల్చిన బాంబుతో తమిళరాజకీయాల్లో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకోనున్నాయి.
అసెంబ్లీలో కాంగ్రెస్ అన్నాడీఎంకేల మధ్య మాటలయుద్ధం
దక్షిణభారతదేశంలో తమిళనాడుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి రాజకీయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. జయలలిత, కరుణానిధిల మరణాంతరం ఇక్కడి రాజకీయాలు మరింత ఇంట్రెస్టింగ్గా మారాయి. బద్ధ శతృవులైన డీఎంకే అన్నాడీఎంకేలకు నేతృత్వం వహించిన ఇద్దరు అగ్రనేతలు మృతి చెందడంతో రెండు పార్టీల్లోను లుకలుకలు మొదలయ్యాయి. ఇక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్నాడీఎంకే కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అదేసమయానికి డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం జోక్యం చేసుకుని కాంగ్రెస్-డీఎంకే పొత్తు ఖరారైనట్లు స్పష్టమవుతోంది కాబట్టి అన్నాడీఎంకే ఏమి ఖాళీగా ఉండబోదని... మరొక పార్టీతో చేతులు కలుపుతుందని పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
అన్ని పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తేనే....
ఒక జాతీయ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము అన్నాడీఎంకేకు ఉందా అని సీఎల్పీ నేత కేఆర్ రామస్వామి ప్రశ్నించారు. ఇందుకు బదులిచ్చిన పన్నీర్ సెల్వం ఇలా సమాధానం ఇచ్చారు. అన్ని పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే అన్నాడీఎంకే కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చాలా సింపుల్గా బాంబు పేల్చేశారు. ఈ సమాధానం పన్నీర్ సెల్వం నుంచి రాగానే... కాంగ్రెస్ నేత కేఆర్ రామస్వామి ముఖం చిన్నబోయినట్లుగా కనిపించింది. ఎందుకంటే డీఎంకేతో కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఎన్నికల్లో పోటీచేస్తోంది.
పీయూష్ గోయల్తో మంత్రులు చర్చలు
ఇదిలా ఉంటే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీల మధ్య పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. అయితే 2014లో అన్నాడీఎంకే పార్టీ ఒంటరిగా పోటీచేసింది. ఈ సారి పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు. బీజేపీతో కలిసే 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉందని పన్నీర్ సెల్వం చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో తమిళనాడు మున్సిపల్ శాఖా మంత్రి ఎస్పీ వేలుమణి, విద్యుత్ శాఖ మంత్రి తంగమణిలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పొత్తులపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బృందంలో ఈ ఇద్దరు మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు.
బీజేపీతో కలిసి వెళితే అన్నాడీఎంకేకు లాభిస్తుంది: విశ్లేషకులు
బీజేపీతో కలిసి వెళ్లాలనే అన్నాడీఎంకే ఆలోచన మంచిదే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈపీఎస్పై బీజేపీ కూడా ఒత్తిడి తీసుకొస్తున్న మాట వాస్తవమే అని వారు చెబుతున్నారు. తమిళనాడు పశ్చిమ ప్రాంతంలో ప్రధాని మోడీ పర్యటించారు. ఇక్కడినుంచే సీఎం పళని స్వామి నాయకుడిగా ఎదిగారు. మరోవైపు ఈ ప్రాంతంలో అన్నాడీఎంకేకు మంచి బలం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. 1998లో కోయంబత్తూరు పేలుళ్ల తర్వాత ఈ ప్రాంతంలో బీజేపీ పుంజుకుందని చెబుతున్న విశ్లేషకులు ఆ తర్వాత నిలుపుకోలేకపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీతో కలిసి వెళ్లడంపై అన్నాడీఎంకేలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై పొత్తును కోరుకుంటుంటే... మరో సీనియర్ నేత సి.పొన్నియన్ మాత్రం కమలం పార్టీతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ప్రజలు కూడా ఈ దీన్ని ఇష్టపడటం లేదని పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.