టీటీవీ దినకరన్ కు జై, ఎమ్మెల్యేతో సహ 44 మందిపై వేటు, పళని, పన్నీర్ వార్నింగ్!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేతో సహ 44 మంది నాయకులను ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పించారు. అన్నాడీఎంకే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న 44 మంది నాయకులను గురువారం బహిష్కరించారు.
స్ట్రాంగ్ వార్నింగ్
గతంలో 9 మంది దినకరన్ అనుచరులను పార్టీ నుంచి సాగనంపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఇలాగే ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి, పన్నీర్ సెల్వం వార్నింగ్ ఇచ్చారు.
క్లారిటీ ఇచ్చిన పళని, పన్నీర్
అన్నాడీఎంకే పార్టీ నుంచి 44 మంది నాయకులను బహిష్కరించామని ఆ పార్టీ కన్వీనర్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తమిళనాడు ముఖ్యమంత్రి, ఆ పార్టీ కో కన్వినర్ ఎడప్పాడి పళనిస్వామి గురువారం క్లారిటీ ఇచ్చారు.
ఇలాగే ఉంటుంది
మదురై, వేలూరు, తిరుచనాపల్లి, ధర్మపురి, పెరంబూరు ప్రాంతాలకు చెందిన అన్నాడీఎంకేకి చెందిన 44 మంది నాయకులు పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారని, ఎప్పుడో బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ కు మద్దతుగా తిరుగుతున్నారని పళనిస్వామి, పన్నీర్ సెల్వం అన్నారు.
ఎమ్మెల్యే మీద వేటు
అన్నాడీఎంకే పార్టీలో ఉంటూ వ్యతిరేకులతో చేతులు కలిపి తిరుగుతున్న 44 మందిని శాస్వతంగా పార్టీ నుంచి బహిష్కరించామని, ఇక ముందు ఎవరైనా ఇలానే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హెచ్చరించారు. బహిష్కరణకు గురైన నాయకుల్లో మదురై జిల్లాలోని మేలూరు శాసన సభ్యుడు ఆర్. స్వామి కూడా ఉన్నారు.