అన్నాడీఎంకే డిప్యూటీ చీఫ్ గా జాజ్ సినిమాస్ సీఈవో ! చక్రం తిప్పుతున్న శశికళ !
అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా శశికళ మేనల్లుడిని నియమించడానికి పావులు కదుపుతున్నారని వెలుగు చూసింది.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా శశికళ మేనల్లుడిని నియమించడానికి పావులు కదుపుతున్నారని వెలుగు చూసింది. శశికళ కుటుంబ సభ్యుల అండలేకుంటే తాము ప్రభుత్వాన్ని నడిపించలేమని, చినమ్మ చెప్పకుండా తాము ఏమీ చెయ్యలేమి కొందరు నాయకులు అనుకుంటున్నారని తెలిసింది.
ఏఐఏడీఎంకే చీలిక వర్గాల విలీనంలో భాగంగా రెండు వర్గాలు రెండు కావాలని పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి వర్గాలు చర్చలు జరపడానికి సిద్దం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్ ను దూరం పెడుతున్నామని ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గంలోని నాయకులు చెప్పారు.
అధికారికంగా తప్పించలేదు
అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్ ను తప్పించామని సాంకేతికంగా ( అధికారికంగా) ప్రకటించలేదు. ఇదే సమయంలో చిన్నమ్మ, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వం సిద్దం అయ్యిందని తెలిసింది.
శశికళ, టీటీవీ కోసం
శశికళ, టీటీవీ దినకరన్ నిర్వహిస్తున్న పదవులకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించడానికి ఎడప్పాడి పళనిసామి వర్గం సిద్దం అయ్యిందని వెలుగు చూసింది. ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన టీటీవీ దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అధికారం మా చేతుల్లోనే ఉండాలి
తమిళనాడు ప్రభుత్వం తమ కనుసన్నల్లో ఉండాలని శశికళ భావిస్తున్న నేపథ్యంలో ఆమె బంధువుల్లో ఒకరిని అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.
ఆయన
శశికళతో పాటు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమె వదిన ఇళవరిసి కుమారుడు వివేక్ ను అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించాలని పళనిసామి ప్రభుత్వం నిర్ణయించిదని సమాచారం. ఇప్పటికే వివేక్ ను అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి రంగం సిద్దం చేస్తున్నారు.
జయలలిత అంటే ఇష్టం
వివేక్ చిన్నతనం నుంచే పోయెస్ గార్డెన్ లో ఉండేవాడు. వివేక్ అంటే జయలలితకు కూడా చాల ఇష్టం అని సమాచారం. వివేక్ తండ్రి జయరామన్ హైదరాబాద్ లోని జయలలిత ద్రాక్ష తోట చూసుకునేవారు. జయరామన్ మరణించిన తరువాత వివేక్ వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. వివేక్ జాజ్ సినిమాస్ సీఈవోగా పని చేస్తున్నాడు.
మాజీ మంత్రి
కరూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి వివేక్ ను అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి ఇప్పటికే 19 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారని వెలుగు చూసింది. మొత్తం మీద వివేక్ ను రంగంలోకి తీసుకురావడానికి ఎడప్పాడి పళనిసామి వర్గం పావులు కదుపుతున్నారని సమాచారం.