కర్ణాటకలో 20 నియోజక వర్గాల్లో తమిళ తంబీలు పోటీ, మన్నార్ గుడి గ్యాంగ్ డిసైడ్, బీజేపీ !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో 20 నియోజక వర్గాల్లో పోటీ చెయ్యడానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురై మన్నార్ గుడి గ్యాంగ్ లోని టీటీవీ దినకరన్ వర్గంలో ఉన్న పూహళేంది అన్నారు. శనివారం బెంగళూరులో పూహళేంది మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
20 నియోజక వర్గాలు
కర్ణాటకలో ఎక్కువ తమిళ ప్రజలు నివాసం ఉంటున్న చోట తాము పోటీ చేస్తామని పూహళేంది అన్నారు. బెంగళూరు నగరంలోని పులకేశీనగర, సీవీ రామన్ నగర, గాంధీనగర్, మైసూరు, చామరాజనగర, అనేకల్, హానూరు తదితర ప్రాంతాల్లో పోటీ చేస్తామని పూహళేంది అన్నారు.
బీజేపీకి మద్దతు ఇవ్వం
కర్ణాటకలో 50 లక్షల మంది తమిళ ప్రజలు నివాసం ఉంటున్నారని, బెంగళూరు నగరంలోనే 35 లక్ష్లల మంది తమిళ ప్రజలు నివాసం ఉంటున్నారని పూహళేంది చెప్పారు. బీఎస్. యడ్యూరప్ప తమతో సన్నిహితంగా ఉన్నారని, అయితే ఇటీవల బీజేపీ తీసుకున్న నిర్ణయాల కారణంగా తాము బీజేపీకి ఎలాంటి పరిస్థితో మద్దతు ఇవ్వమని పూహళేంది అన్నారు.
మాజీ ప్రధాని మీద ఫైర్
భారత మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారని, ఈ రోజు మాట్లాడిన మాటలకు మరుసటి రోజు ప్లేటు పిరాయిస్తున్నారని పూహళేంది ఆరోపించారు. జేడీఎస్ కు తాము ఎలాంటి పరస్థితిలో మద్దతు ఇవ్వమని, బెంగళూరులోని చామరాజపేటలో గత ఎన్నికల్లో జమీర్ అహమ్మద్ మా మద్దతుతో గెలిచారనే విషయం హెచ్.డి. దేవేగౌడ మరిచిపోయారని పూహళేంది ఆరోపించారు.
కమిటీలో నిర్ణయం
తాము పోటీ చెయ్యని నియోజక వర్గాల్లో తమిళ ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలో పార్టీ సమావేశంలో నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పూహళేంది అన్నారు. తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉన్న ప్రతి నియోజక వర్గంలో పోటీ చేస్తామని, ఇప్పటికే అభ్యర్థుల జాబితా సిద్దం అయ్యిందని, త్వరలో విడుదల చేస్తామని పూహళేంది వివరించారు.