ఎల్లుండి కేంద్ర మంత్రివర్గ విస్తరణ? జోరుగా మోడీ, అమిత్ షా మంతనాలు!
కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ఢిల్లీలో జోరుగా మంతనాలు కొనసాగుతున్నాయి. ఈ దిశగా పార్టీ నేతలు, కేంద్రమంత్రులతో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా, ప్రధాని నరేంద్ర మోడీ మంతనాలు సాగిస్తున్నారు.
ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ఢిల్లీలో జోరుగా మంతనాలు కొనసాగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ దిశగా పార్టీ నేతలు, కేంద్రమంత్రులతో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా, ప్రధాని నరేంద్ర మోడీ మంతనాలు సాగిస్తున్నారు.
ఎన్డీయేలో చేరేందుకు పలు పార్టీలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో చేపట్టనున్న ఈ మంత్రివర్గ విస్తరణలో ఏడుగురు కేంద్రమంత్రులపై వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
సీనియర్ మంత్రుల శాఖల్లోనూ పలు మార్పులు చేయాలని మోడీ, అమిత్షా భావిస్తున్నట్టు సమాచారం. జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఇటీవల విలీనమైన అన్నాడీఎంకే వర్గాలు ఎన్డీయేలో చేరే అవకాశం ఉంది.
లోక్సభ ఎన్నికలకు ఇంకా సుమారు ఒకటిన్నర సంవత్సరాలు గడువు ఉండటంతో ఇదే చివరి మంత్రివర్గ విస్తరణ అని పలువురు భావిస్తున్నారు. వరుస రైల్వే ప్రమాదాల దృష్ట్యా రాజీనామా చేస్తానని ఇప్పటికే కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చెప్పగా.. మోడీ వద్దన్నారని ఆయనే స్వయంగా తన ట్విటర్లో నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా కేంద్రమంత్రి అనిల్ దవే ఇటీవల కన్నుమూయడం, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికకావడంతో ఆయా శాఖలను భర్తీ చేసే అవకాశం ఉంది. గతంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ శాఖను అరుణ్జైట్లీకి అప్పగించారు. ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో వీటన్నింటినీ భర్తీ చేయనున్నట్టు సమాచారం.
రవాణా శాఖకు సంబంధించిన శాఖలన్నీ ఒకరి వద్దే ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని గతంలో ప్రధాని వెల్లడించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందున పార్టీకి అవసరమైన పలువురు కేంద్రమంత్రులను తప్పించి వారి సేవల్ని వినియోగించుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
కొత్తగా మంత్రివర్గంలోకి జేడీయూ, అన్నాడీఎంకేను తీసుకొనే అవకాశం ఉంది. రేపు వినాయక చవితి కాబట్టి.. ఎల్లుండి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.