అమ్మ, పార్టీకి శశికళ ద్రోహం: సీఎం పళని, పన్నీర్ నిర్ణయం: అమ్మా టీవీ, అమ్మా పత్రిక !
చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వానికి శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ద్రోహం చేస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, అందుకే సొంత టీవీ చానల్, దిన పత్రికను ప్రారంభించాలని పన్నీర్ సెల్వం, పళనిస్వామి నిర్ణయించారు. ప్రతిపక్ష డీఎంకే పార్టీతో సహ అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసిన శశికళ కుటుంబ సభ్యులకు సొంత టీవీ చానల్, దినపత్రికలు ఉన్నాయి.
శశికళ ఫ్యామిలీ !
అన్నాడీఎంకే పార్టీ కోసం జయలలిత స్థాపించిన జయా టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక శశికళ కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంది. గత డిసెంబర్ నెలలో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీటీవీ దినకరన్ కు మద్దతుగా ప్రచారం చేస్తూ పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకం
నమదు ఎంజీఆర్ దినపత్రిక, జయా టీవీ తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తమ పార్టీకి కూడా సొంత మీడియా ఉండాలని అన్నాడీఎంకే పార్టీ శాసన సభ్యుల సమావేశంలో చర్చించారు.
పన్నీర్ చేతిలో జీ టీవీ
అన్నాడీఎంకే పార్టీ మీద, శశికళ వర్గం మీద తిరుగుబాటు చేసిన సమయంలో పన్నీర్ సెల్వం సొంతంగా టీవీ చానల్ ప్రారంభించాలని నిర్ణయించారు. అప్పట్లో జీ టీవీని సైతం పన్నీర్ సెల్వం కొనుగోలు చేశారని, త్వరలో అమ్మా టీవీ చానల్ పేరుతో కొత్త టీవీ చానల్ ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది.
పళని, పన్నీర్ సెల్వం
చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సొంత మీడియా ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు.
అదే పేరుతో చానల్, పేపర్
ఇప్పటికే ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం సొంత టీవీ చానల్, దిన పత్రిక విషయంలో గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. అన్నాడీఎంకే పార్టీ కొసం అమ్మా టీవీ చానల్, అమ్మా దిన పత్రిక స్థాపించడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని, నిపుణులు వాటి పనుల్లో నిమగ్నం మయ్యారని తెలిసింది.
దినకరన్ తో జాగ్రత్త ?
ఈనెల 8వ తేదీ నుంచి జరిగే శాసన సభ సమావేశాలకు టీటీవీ దినకరన్ హాజరౌతారని, ఆ సందర్బంలో అతను ఎదురు వచ్చినా చూసి నవ్వకూడదని, మాట్లాడకూడదని ఎమ్మెల్యేలకు సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం గట్టి హెచ్చరికలు జారీ చేశారు.