అమ్మ జయలలిత పార్టీతో సూపర్ స్టార్ రజనీకాంత్ దోస్తీ, టార్గెట్ 2021, ఫ్యాన్స్ నిర్ణయం!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే (జయలలిత ఏఐఏడీఎంకే) పార్టీ వచ్చే శాసన సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చెయ్యాలని నిర్ణయించింది. ఇప్పటికే బీజేపీతో కలిసి ఏఐఏడీఎంకే ముందుకు వెలుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఏఐఏడీఎంకే పార్టీ 2021 శాసన సభ ఎన్నికల్లో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి పని చెయ్యాలని (దోస్తి) దాదాపు నిర్ణయించిందని సమాచారం.
సీఎం పళనిస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వచ్చే శాసన సభ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీని ఢీకొనాలంటే కచ్చితంగా ఏఐఏడీఎంకే పార్టీని మరింత బలోపేతం చెయ్యాలని సీఎం పళనిస్వామి నిర్ణయించారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో అధిక సీట్లు కైవసం చేసుకోవాలని, కచ్చితంగా మళ్లీ అధికారంలోకి రావాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామి కసరత్తులు చేస్తున్నారని తెలిసింది.
పన్నీర్ సెల్వం ప్లాన్
తమిళనాడులో డీఎంకే పార్టీని డీకొనాలంటే కచ్చితంగా బలమైన నాయకత్వం కావాలని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన సన్నిహితులతో అన్నారని తెలిసింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి పని చేస్తే కచ్చితంగా తమకు అనుకూలంగా ఫలితం ఉంటుందని, ఆ దిశగా తాము ముందుకు వెలితే మంచిదని పన్నీర్ సెల్వం ఆయన సన్నిహితులతో అన్నారని తెలిసింది. మొదటి నుంచి రజనీకాంత్ పట్ల పన్నీర్ సెల్వం సున్నితంగానే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
జయలలిత లేని లోటు
అమ్మ జయలలిత మరణించిన తరువాత ఆమె అధికారంలోకి తెచ్చిన అన్నాడీఎంకే పార్టీని ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చామని, మళ్లీ అమ్మలేని లోటు తీరాలంటే రజనీకాంత్ తో కలిసి పని చెయ్యడం మంచిదని చాల మంది ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.
సూపర్ స్టార్ ఫ్యాన్స్ నిర్ణయం
గత ఏడాది తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. ఇప్పటికే రజనీకాంత్ అభిమాన సంఘాలు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, బూత్ కమిటీలు ఏర్పాటు చేశారు. రజనీకాంత్ తనకంటూ రాజకీయంగా ఓ ఫ్లాట్ ఫాం తయారు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అన్నాడీఎంకే పార్టీతో కలిసి రజనీకాంత్ ముందుకు వెలుదామంటే ఆయన అభిమానులు అంగీకరిస్తారా ? లేదా ? అనే విషయం అంతు చిక్కడం లేదు.
రెండాకుల చిహ్నం
ఎంజీఆర్, జయలలితకు ఎంత క్రేజ్ ఉందో అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నంకు అంతే క్రేజ్ ఉంది. తమిళనాడులో రెండాకుల చిహ్నం చూస్తే వెనుకా ముందు ఆలోచించకుండా ఓటు వేసే అభిమానులు ఉన్నారు. అలాంటి రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి వీకే. శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యుడు టీటీవీ దినకరన్ తో న్యాయపోరాటం చేసిన సీఎం ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం చివరికి విజయం సాధించారు.
2021 ఎన్నికలు టార్గెట్
2021 శాసన సభ ఎన్నికల్లో రజనీకాంత్ తో కలిసి పని చేస్తే అన్నాడీఎంకే పార్టీకి ఎదురు ఉండదని, మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తామని, అమ్మ ఆశయాలు నెరవేర్చడానికి చక్కటి అవకాశం ఉంటుందని కొందరు నాయకులు అంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రజనీకాంత్ తో కలిసి పని చెయ్యడానికి సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సానుకూలంగానే ఉన్నారని సమాచారం.