పన్నీర్, పళనిసామి చర్చలు విఫలం: ఈ డిమాండ్లకు క్లారిటీ లేదు, పన్నీర్ పట్టుతో సీఎంకు?
చెన్నై: జయలలిత మరణించిన తరువాత ముక్కలైన అన్నాడీఎంకే పార్టీ విలీన చర్చలు రోజురోజుకు ఆలస్యం అవుతోంది. విలీనం చర్చల సమయంలో హై డ్రామా చోటు చేసుకోవడంతో చర్చలు వాయిదా పడ్డాయి. పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు మళ్లీ దూరం అయ్యారు.
జయలలిత మృతిపై విచారణకు శశికళ సిద్దం, జైల్లో దినకరన్ భేటీ, ఏం చెయ్యాలో తెలుసు!
శుక్రవారం రాత్రి దాదాపు నాలుగు గంటలు పాటు పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ సమయంలో శశికళ కుటుంబ సభ్యులు అందర్నీ అన్నాడీఎంకే పార్టీకి దూరం పెట్టాలని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేసింది.
కథ మళ్లీ మొదటికి వచ్చింది
జయలలిత మృతిపై విచారణకు ఆదేశించిన విషయంలో పన్నీర్ సెల్వం వర్గం సంతృప్తి చెందింది. అయితే శశికళ కుటుంబ సభ్యుల విషయంలో పళనిసామి వర్గం ఏ విషయం స్పష్టం చెయ్యకపోవడంతో కథ మళ్లీ మొదటికి రావడంతో పన్నీర్ సెల్వం వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది.
బహిరంగంగా చెప్పాలి
శశికళను వెంటనే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బహిరంగంగా చెప్పాలని పన్నీర్ సెల్వం వర్గం పట్టుబట్టింది. ఈ విషయంలో పళనిసామి వర్గీయులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే విలీనం చర్చలకు బ్రేక్ పడిందని పన్నీర్ సెల్వం వర్గం అంటోంది.
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ, పార్టీ ?
పదవులు పంపకం విషయంలోనూ ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పదవి, ఆర్థిక శాఖ, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు పన్నీర్ సెల్వంకు అప్పగించాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.
సీఎంకు చెమటలు పట్టాయి
పన్నీర్ సెల్వంకు, ఆయన వర్గంలోని నాయకులు పదవులు ఇచ్చే విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. విలీన చర్చలు ఓ కొలిక్కి వస్తే శనివారం పళనిసామి, పన్నీర్ సెల్వం కలిసి జయలలిత సమాధి దగ్గర తాము కలిసిపోతున్నామని అధికారికంగా ప్రకటించనున్నారు.
చాప కింద నీరులా ?
పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఏం మాట్లాడుకుంటున్నారు అని పూర్తి వివరాలు తెలుసుకుంటున్న టీటీవీ దినకరన్ మమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తే తరువాత ఏమి చెయ్యాలి ? ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తమ సత్తా చాటుకుందామా ? అంటూ చాప కింద నీరులా పావులు కదుపుతున్నారు.