రెండాకులపై సెటైర్: ఖుష్బూకి జయలలిత పార్టీ కౌంటర్
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే రెండు ఆకులు రాలిపోతాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ప్రముఖ నటి ఖుష్బూ వ్యాఖ్యానించారు. దీనిపై అన్నాడీఎంకే మహిళా మంత్రులు ఘాటుగా స్పందించారు. రాలిపోవడానికి అప్పుడే వచ్చిన ఆకులు కాదని, కార్యకర్తల శ్రమతో ఎదిగిన మర్రి చెట్టు అన్నారు.
ఇటీవల కాంగ్రెస్ బహిరంగ సభలో ఖుష్బూ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖుష్బూ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో రెండాకుల గుర్తు రాలిపోతుందని, చేతుల సాయంతో సూర్యోదయం ప్రజకు వెలుగు నిస్తుందని అన్నారు.
దీనిపై అన్నాడీఎంకే మహిళా మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రెండాకుల గుర్తు జయలలిత శ్రమతో మర్రిచెట్టుగా ఎదిగిందని, ప్రజలు, కార్యకర్తలు వేర్లుగా నిలిచారని, వీరు చెట్టును అంటిపెట్టుకున్నంత కాలం ఏ పార్టీ అన్నాడీఎంకే మహావృక్షాన్ని కూల్చలేదన్నారు.
పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడు వెనుకంజలో ఉంద్న ప్రతి నేతకు జయలలిత ప్రజల కోసం రూపొందిస్తున్న మేనిఫెస్టో సమాధానం ఇస్తుందని చెప్పారు. విజయకాంత్, ప్రేమలత ప్రజలకు ఇంటింటికి రేషన్ సరుకులు పంపిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారని, అధికారంలోకి రాని వారే ఇలాంటి పగటి ప్రకటనలు చేస్తారన్నారు.