తమిళనాడు మాజీ మంత్రి రిసార్ట్ నుంచి ఎస్కేప్: దినకరన్ కు మద్దతు, చీటింగ్ కేసులో వేట !
బెంగళూరు: చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి, టీటీవీ దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ చెన్నై పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో కొడుగు సమీపంలోని రిసార్ట్ నుంచి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు.
రాష్ట్రపతితో గవర్నర్ విద్యాసార్ రావ్ భేటీ: 18 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల విషయం!
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సెంథిల్ బాలాజీ రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో రవాణా శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి దగ్గర రూ. 4.25 లక్షలు తీసుకున్నాడు. ఎంత కాలానికి ఉద్యోగం రాకపోవడంతో బాధితుడు సెంథిల్ బాలాజీని నిలదీశాడు.
నేను మంత్రి, ఏం చేస్తావు ?
మంత్రి హోదాలో ఉన్న తనను నువ్వు ఏమీ చెయ్యలేవని సెంథిల్ బాలాజీ బెదిరించడంతో బాధితుడు చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరువాత చాల మంది బాధితులు ఉద్యోగం ఇప్పిస్తామని మా దగ్గర సెంథిల్ బాలాజీ డబ్బు తీసుకున్నాడని పోలీసులను ఆశ్రయించారు.
రూ. 1.20 కోట్లు స్వాహా
ఉద్యోగం ఇప్పిస్తానని సెంథిల్ బాలాజీ మొత్తం రూ. 1.20 కోట్లు తీసుకుని మోసం చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న జయలలిత అప్పట్లో సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం కేసులు విచారణలో ఉన్నాయి.
చెన్నై క్రైంబ్రాంచ్ పోలీసుల వేట
మంగళవారం చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులు కొడుగు చేరుకుని సెంథిల్ బాలాజీని విచారణ చెయ్యడానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న సెంథిల్ బాలాజీ రిసార్ట్ వెనుక దారి నుంచి తప్పించుకుని పారిపోయాడని తెలిసింది. మొత్తం మీద టీటీవీ దినకరన్ కు మద్దతు ఇచ్చినందుకు సెంథిల్ బాలాజీని ఇప్పుడు పాత కేసులు వెంటాడుతున్నాయి.
మంత్రి పదవి కోసం
మంత్రి పదవి ఇవ్వకుంటే మీ అంతు చూస్తామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని గతంలో సెంథిల్ బాలాజీ సీఎం ఎడప్పాడి పళనిసామిని బహింరంగానే ఎదిరించారు. ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని బహిరంగ సభకు ఏర్పాట్లు చేసి చివరి నిమిషయంలో రద్దు చేశారు.
పళని, పన్నీర్ దెబ్బకు !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ఒక్కటి అయిన తరువాత సెంథిల్ బాలాజీ స్వరం పెంచారు. టీటీవీ దినకరన్ వర్గంలో చేరిపోయి కొందరు ఎమ్మెల్యేలను లాక్కున్నారు. చివరికి ఇప్పుడు అరెస్టు భయంతో రిసార్ట్ నుంచి రహస్య ప్రాంతానికి పారిపోయాడు, సెంథిల్ బాలాజీతో పాటు దినకరన్ వర్గంలోని మరో సీనియర్ ఎమ్మెల్యే పళనియప్పన్ సైతం రిసార్ట్ నుంచి పారిపోయాడని వెలుగు చూసింది.