సీఎం పళని, పన్నీర్ సెల్వంకు షాక్, టీటీవీ దినకర్ గ్రూప్ లోకి ఎమ్మెల్యే జంప్, ఇంకా!
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీద తిరుబాటు చేసిన ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ గ్రూలోకి అధికారంలో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే జంప్ అయ్యాడు. ఈ దెబ్బతో సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం షాక్ కు గురైనారు.
తిరుగుబాటు
తమిళనాడులో అధికార పార్టీ వర్గంలో ఉన్న విల్లుపురం జిల్లాలోని కళ్లకురిచి నియోజక వర్గం ఎమ్మెల్యే ప్రభు శుక్రవారం చెన్నైలోని అడయార్ లోని టీటీవీ దినకరన్ ఇంటికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం టీటీవీ దినకరన్, ఎమ్మెల్యే ప్రభు సుదీర్ఘంగా చర్చించారు.
ప్రజలు నమ్ముతున్నారు
తమిళనాడు ప్రజలు, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు టీటీవీ దినకరన్ ను నమ్ముతున్నారని రెబల్ ఎమ్మెల్యే ప్రభు మీడియాకు చెప్పారు. ప్రజలు టీటీవీ దినకరన్ ను నమ్ముతున్నారని చెప్పడానికి ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు ఓ ఉదాహరణ అని రెబల్ ఎమ్మెల్యే ప్రభు అన్నారు.
ఒక్కపని కాలేదు
తన నియోజక వర్గం అభివృద్ది కోసం నిధులు మంజూరు చెయ్యడం లేదని, ఒక్కపని చెయ్యడం లేదని, విల్లుపురం జిల్లాను రెండుగా చేసి కళ్లకురిచి పట్టణాని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చాల సార్లు మనవి చేసినా సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం పట్టించుకోవడం లేదని రెబల్ ఎమ్మెల్యే ప్రభు ఆరోపించారు.
విల్లుపురం జిల్లా ఖాళీ
విల్లుపురం జిల్లాలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అందరూ త్వరలో టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తారని రెబల్ ఎమ్మెల్యే ప్రభు జోస్యం చెప్పారు.
సీఎం పదవి అంతే
తన వర్గంలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభుతో భేటీ అయిన తరువాత ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వాన్ని, సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ప్రజలు నమ్మడం లేదని, వారి పని ఇక అంతే అన్నారు.