అన్నాడీఎంకేలో వర్గపోరు: శశికళకు దేవర్ వర్గం, దీపాకు !
అన్నాడీఎంకేలో దేవర్ సామాజిక వర్గం శశికళకు మద్దతు ఇస్తున్నారు. అయితే మాకూ అవకాశం ఎందుకు రాదో చూద్దాం అంటూ మరో వర్గంలోని నాడార్లు ఎదురు చూస్తున్నారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తరువాత పార్టీలో అంతటి చరిష్మా ఉన్న వ్యక్తి ఎవరూ ? అంటే అన్నాడీఎంకే నాయకులు దగ్గర సమాధానం లేదు. ఓ వర్గం చిన్నమ్మ శశికళ అంటున్నారు.
మరో వర్గం వారు మాత్రం పైపైకి శశికళ అంటున్నా, ఆమెకు పార్టీని నడిపించే సత్తా ఉందా ? అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో జయలలిత మేనకోడలు దీపా రంగంలోకి రావడంతో అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరు మొదలైయ్యింది.
శశికళ వర్గం ఒక వైపు, అన్నాడీఎంకే సీనియర్లు ఓ వైపు, జయలలితకు వీరాభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఓ వైపుకు చేరడంతో అన్నాడీఎంకే పార్టీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ఇదే సమయంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు దక్షిణ తమిళనాడులో ఎక్కడలేని మద్దతు రావడంతో ఇప్పుడు శశికళ వర్గీయుల్లో దడపుట్టుకుంది. దేవర్ సామాజిక వర్గం శశికళకు మద్దతు ఇస్తున్నారు.
అయితే మాకూ అవకాశం ఎందుకు రాదో చూద్దాం అంటూ నాడార్లు ఎదురు చూస్తున్నారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలోని 49 మంది ఎంపీలు పోయెస్ గార్డెన్ చేరుకుని శశికళను కలిసి పూర్తి మద్దతు ఇచ్చారని సమాచారం.
ఈనెల 21వ తేదని అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో ఎవరి బలం ఎంత ఉందో తెలిసిపొతుందని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. ఇదే సమావేశంలో శశికళ వ్యతిరేకులు ఆమెకు వ్యతిరేకంగా విరుచుకుపడే అవకాశం ఉందని సమాచారం.