షాక్: శశికళ, దినకరన్లపై సస్సెన్షన్ వేటేసిన అన్నాడిఎంకె
చెన్నై : అన్నాడిఎంకెలో సోమవారం నాడు కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి.అన్నాడీఎంకే నుంచి చిన్నమ్మ శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ను బహిష్కరించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో వీరిని బహిష్కరిస్తూ అధికారిక నిర్ణయం తీసుకున్నారు
పార్టీ అధినేత్రి జయలలిత మరణం తర్వాత రెండు వర్గాలుగా చీలిపోయిన పార్టీ.. ఇటీవలే మళ్లీ కలిసిపోయిన విషయం తెలిసిందే. దీంతో విలీనంపై దినకరన్ ఎదురుతిరిగారు. పార్టీ ఉపప్రధాన కార్యదర్శి హోదాలో ముఖ్యమంత్రి పళనిస్వామి సహా పలువురు అన్నాడీఎంకే నేతలను తమ పదవుల నుంచి తప్పిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో సమావేశమైన అన్నాడీఎంకే పార్టీ.. శశికళ, దినకరన్ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్నాడీఎంకే ఎంపీ ముతుకరప్పన్ సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. 'శశికళ, దినకరన్ను పార్టీ నుంచితొలగించాం. ఇకపై పార్టీ తరఫున దినకరన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చెల్లదు.
పార్టీ నియమాల ప్రకారం.. దినకరన్ నియామకం జరగలేదు. అంతేగాక, ఆయన నియామకాన్ని ఎన్నికల సంఘం కూడా ధ్రువీకరించలేదు' అని తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి శశికళ పార్టీ పగ్గాలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన శశికళ.. ఆమె మేనల్లుడు దినకరన్కు ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.
ఈ విషయంలో పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పార్టీ రెండుగా చీలిపోయింది. అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఇటీవలే రెండు వర్గాలు ఒక్కటయ్యాయి. శశికళ, దినకరన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని అప్పుడే విలీనం సాధ్యమవుతుందని పన్నీర్ వర్గం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికను పార్టీ అధీనంలోకి తెచ్చుకుంటామని స్పష్టం చేసింది. జయ పబ్లికేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నమదు ఎంజీఆర్ పత్రికకు ప్రస్తుతం జయలలిత యజమానిగా ఉన్నారు. మ్యాజిక్ డాట్ కామ్ జయ టీవీని నిర్వహిస్తోంది.
ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ వర్గాలు తిరిగి ఏకమవడాన్ని తొలి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీటీవీ దినకరన్ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో పళనిస్వామి సహా పలువురు నేతలను తమ పదవుల నుంచి తొలగించినట్టు తెలిపారు.
దీంతో స్పందించిన అన్నాడీఎంకే ఈ రోజు అత్యవసరంగా సమావేశమై శశికళ, దినకరన్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వారిని పార్టీ నుంచి బహిష్కరించామని, ఇకపై దినకరన్ తీసుకునే నిర్ణయాలు చెల్లబోవని అన్నాడీఎంకే ఎంపీ ముతుకరప్పన్ పేర్కొన్నారు. పార్టీ నియమనిబంధనల ప్రకారం దినకరన్ ఎన్నిక జరగలేదని, కాబట్టి ఆయన నిర్ణయాలకు ఎటువంటి ప్రాధాన్యం ఉండదని స్పష్టం చేశారు.