మోడీతో రెండు నిమిషాల భేటీ: అందుకే తమిళనాడు సీఎంను దూరం పెట్లి!
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామితో కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారని, పళనిసామికి ఎక్కువ సమయం కేటాయించకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని వెలుగు చూసింది.
న్యూఢిల్లీ/చెన్నై: భారత ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామితో మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయించకపోవడానికి అసలు కారణం ఏమిటి ? అనే విషయంపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైయ్యింది.
మోడీతో భేటీ: పాపం తమిళనాడు సీఎం, కేవలం రెండు నిమిషాల్లో కథ క్లోజ్!
భారత ప్రధాని నరేంద్ర మోడీ కేవలం రెండు నిమిషాలు మాత్రమే తమినాడు సీఎం ఎడప్పాడి పళనిసామికి సమయం కేటాయించి వినతిపత్రం తీసుకున్న విషయం తెలిసిందే. మోడీ నిర్ణయం వెనుక ఓ బలమైన కారణం ఉందని తెలిసింది. పళనిసామి తన మనసులోని బాధ చెప్పుకోవడానికి ప్రయత్నించినా అందుకు ప్రధాని మోడీ అవకాశం ఇవ్వలేదని స్పష్పంగా వెలుగు చూసిందని అన్నాడీఎంకే (అమ్మ) వర్గం నాయకులు గుసగుసలాడుతున్నారు.
అది వారి సమస్య, మాకెందుకు
అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం విషయంపై ప్రధాని మోడీతో చర్చించాలని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి ముందే నిర్ణయించుకున్నారు. అయితే ఇది వారి సొంత పార్టీ విషయం, మనం ఎందుకు జోక్యం చేసుకోవాలని నరేంద్ర మోడీ తన సన్నిహితులతో అన్నారని తెలిసింది.
బీజేపీ నాయకులు తక్కువ తిన్నారా
ప్రధాని మోడీతో ఏ విషాలపై మాట్లాడాలి అంటూ ఎడప్పాడి పళనిసామి ఢిల్లీ బయలుదేరక ముందే చెన్నైలో తన సన్నిహితులతో చర్చించారు. ఈ విషం తెలుసుకున్న తమిళనాడు బీజేపీ నాయకులు వెంటనే ఢిల్లీకి సమాచారం ఇవ్వడంతో ఆ పార్టీ హైకమాండ్ అలర్ట్ అయ్యిందని సమాచారం.
తమిళనాడు గవర్నర్ కాకుండా
ఎడప్పాడి పళనిసామి తమిళనాడు గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావు సహాయం తీసుకోకుండా కేళర గవర్నర్, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం సహాయంతో ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అసలు సీహెచ్. విద్యాసాగర్ రావును ఎందుకు పళనిసామి ముందుగా సంప్రదించలేదనే విషయం అంతుపట్టడం లేదు.
నిరుత్సాహంతో పళనిసామి
అనేక విషయాలు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాలని వెళ్లిన తమిళనాడు సీఎం పళనిసామి నిరుత్సాహంతో చెన్నైకి తిరిగివెళ్లారు. కేవలం పలకరింపు వరకే తమ భేటీ ఉంటుందని పళనిసామి ఊహించలేకపోయారు.
వినతి పత్రంలో ఏముంది ?
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన ఎడప్పాడి పళనిసామి ఓ వినపతి పత్రం సమర్పించారు. అందులో తమిళనాడు రైతుల సమస్యలు, రాష్ట్రానికి రావలసిన నిధులు గురించి ప్రస్థావించారని సమాచారం. ఎడప్పాడి పళనిసామి ముందుగా అనుకున్నట్లు మోడీకి చెప్పాలనుకున్న వివరాలు ఆ వినతిపత్రంలో లేవని తెలిసింది.
పన్నీర్ సెల్వం దెబ్బ
తమిళనాడు సీఎం ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే ఆరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మోడీతో ఎక్కువ సేపు పళనిసామి మాట్లాడకుండా పన్నీర్ సెల్వం పావులుకదిపారని విశ్వసనీయ సమాచారం.
మొదటి నుంచి పన్నీర్ వైపు
తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం పని చేసిన సమయంలో జల్లికట్టు ఆర్డినెన్స్, వర్దా తుపాను, పంటనష్టంకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఆయన సక్సస్ అయ్యారు. కేంద్రం కూడా గతంలో పన్నీర్ సెల్వం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.
పన్నీర్ సెల్వం ఓకే
పన్నీర్ సెల్వం మీద ప్రధాని నరేంద్ర మోడీకి మంచి అభిప్రాయం ఉందనే విషయం అనేకసార్లు వెలుగు చూసింది. అంతే కాకుండా జయలలిత రెండు సార్లు పన్నీర్ సెల్వంను సీఎం చేసి తన ముఖ్య అనుచరుడు అంటూ ప్రపంచానికి పరిచయం చేశారు. జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా పన్నీర్ సెల్వం అందరిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
పళనిసామికి ఇదే మైనస్ పాయింట్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ప్రధాని మోడీ ఎక్కవ సమయం కేటాయించకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని తెలిసింది. శశికళ జైలుకు వెళ్లే సమయంలో తనకు అత్యంత సన్నిహితుడైన పళనిసామిని సీఎం చేశారు. శశికళ ప్రధాన అనుచరుడు అనే పళనిసామితో మోడీ అంటిముట్టనట్లు వ్యవహరించారని విశ్వసనీయ సమాచారం.