అన్నాడీఎంకే: అదే గందరగోళం, అయోమయం, నాయకత్వ కుస్తీ
అన్నాడీఎంకేలో నాయకత్వ కుస్తీ కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇచ్చే విషయమై రేగిన దుమారం రోజురోజుకూ తీవ్రమవుతోంది.ఇప్పటికే అన్నాడీఎంకే మూడు చెక్కలయింది.
చెన్నై: అన్నాడీఎంకేలో నాయకత్వ కుస్తీ కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇచ్చే విషయమై రేగిన దుమారం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకే మూడు చెక్కలయింది.
ఆ పార్టీలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ వర్గాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మూడు వర్గాలు విడివిడిగా తమ అభిప్రాయం తెలిపినప్పటికీ.. ఎన్డీఏ అభ్యర్థికే మూడు వర్గాలూ తమ మద్దతు ప్రకటించాయి.
తెరపైకి నాయకత్వ కుస్తీ...
ఈ విషయమై లోక్ సభ ఉపసభాపతి, అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై ప్రకటనతో ఒక్కసారిగా నాయకత్వ కుస్తీ తెరపైకి వచ్చింది. చిన్నమ్మ శశికళే ఎన్డీఏకు మద్దతుగా నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన ప్రకటించడంతో ఇటు ఎడప్పాడి పళనిస్వామి, అటు పన్నీర్ సెల్వం వర్గీయులు ఆయనపై విరుచుకుపడ్డారు.
అధిష్ఠానం... ఇంకా శశికళేనా?
పార్టీలోని అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని కేవలం చిన్నమ్మ శశికళకు మాత్రమే ఆపాదించడం వెనుక సొంత ప్రయోజనాలు ఉన్నాయంటూ ఇరు వర్గాలు మండిపడ్డాయి. అయితే తంబిదురై కూడా అదే స్థాయిలో వారి వ్యాఖ్యానాలను తిప్పికొట్టారు. మంగళవారం విలేకరులు ఈ విషయమై ప్రశ్నించగా తంబిదురై స్పందించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశానుసారమే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపామన్నారు. ఎడప్పాడి పళనిస్వామి, శశికళ ఇద్దరూ కలిసే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
ప్రజలే తేల్చుకుంటారు...
పార్టీ గుర్తు.. రెండాకుల చిహ్నం కోసం అన్నాడీఎంకే రెండు వర్గాలూ ఒక్కటవ్వాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు తంబిదురై వ్యాఖ్యానించారు. అసలిప్పుడు అన్నాడీఎంకే అధిపతి ఎవరని విలేకరులు ప్రశ్నించగా.. అసలైన అన్నాడీఎంకే వారసులెవరో ప్రజలే తేల్చుకుంటారని, ఈ ప్రశ్నకు సమాధానం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చెప్పాలని ఆయన అన్నారు.
రేగిన దుమారం...
తంబిదురై తాజా వ్యాఖ్యలను పళనిస్వామి మద్దతుదారుడు, కట్టుమన్నార్కోయిల్ ఎమ్మెల్యే ఎన్.మురుగుమారన్ ఖండించారు. ఆయన మాటాల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామే పార్టీకి, ప్రభుత్వానికి అధిపతిగా కొనసాగాలన్నారు. పార్టీ నుంచి శశికళ కుటుంబాన్ని దూరంగా పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై టీటీవీ దినకరన్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు వెట్రివేల్, తంగ తమిళ్సెల్వన్ కూడా విరుచుకుపడ్డారు. పార్టీ నుంచి శశికళ, దినకరన్లను ఎవరూ తప్పించలేరని స్పష్టం చేశారు.
ఇంతకీ.. అధిష్ఠానం ఎవరు?
ఈ గందరగోళ పరిస్థితుల్లో అసలు అన్నాడీఎంకే అధిష్ఠానం ఎవరనే విషయం తమకే అయోమయంగా ఉందని ఇద్దరు సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయం కింది స్థాయి కార్యకర్తల్లోనూ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో అటు దినకరన్ వర్గీయులు పలువురు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పన్నీర్సెల్వం, పళనిస్వామి మద్దతుదారులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. సదరు నేతలు పర్యటిస్తే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అన్నాడీఎంకేలో ఏం జరుగుతోందో అర్థం కాక ఇటు శ్రేణులు, అటు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
విలీనం అసాధ్యం.. మద్దతు సెల్వానికే: సెమ్మలై
మరోవైపు అన్నాడీఎంకేలో రెండు వర్గాల విలీనం అసాధ్యమని పేర్కొన్న పన్నీర్సెల్వం వ్యాఖ్యలపై అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ వర్గం నేత సెమ్మలై తాజాగా మాట్లాడారు. పన్నీర్కు పలువురు ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారని, అన్నాడీఎంకే అమ్మ వర్గం దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ విలీనం ఉండదని తేల్చి చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉందని, ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. అన్నాడీఎంకే మూడు వర్గాలుగా చీలినట్లు కనిపిస్తున్నా... శ్రేణుల మద్దతు పన్నీర్సెల్వానికే ఉందని తెలిపారు.