అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం కేసు: ఎన్నికల కమిషన్ ముందు నేడు చివరి చాన్స్, ఎవరికో !
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం ఎవ్వరికి కేటాయించాలి ? అనే విషయంపై సోమవారం భారత ఎన్నికల కమిషన్ అధికారులు తుది వాదనలు వినడానికి సిద్దం అయ్యారు.
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం ఎవ్వరికి కేటాయించాలి ? అనే విషయంపై సోమవారం భారత ఎన్నికల కమిషన్ అధికారులు తుది వాదనలు వినడానికి సిద్దం అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం వారి వాదనలు వినిపించడానికి ఢిల్లీ చేరుకున్నారు.
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన శశికళ, టీటీవీ దినకరన్ వర్గం సైతం వారి వాదనలు వినిపించడానికి సిద్దం అయ్యారు. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలంటూ ఇరు వర్గాల నాయకులు ఎన్నికల కమిషన్ ముందు పోటీపడుతున్నారు.
అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం మాకే వస్తుందని రెండు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రెండు వర్గాల నాయకులు కొన్ని వేల పేజీల అఫిడవిట్లు ఎన్నికల కమిషన్ అధికారులకు సమర్పించారు. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నంతో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంత మంది ఎవరెవరి వైపు ఉన్నారు అనే పూర్తి సమాచారం ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ రెండు వర్గాలకు సూచించింది.
అన్నాడీఎంకే పార్టీకి చెందిన తమిళనాడులోని అన్ని జిల్లాల ప్రధాన కార్యదర్శుల సంతకాలు సేకరించిన పళనిసామి, పన్నీర్ సెల్వం ఆ పత్రాలను ఎన్నికల కమిషన్ అధికారులకు సమర్పించారు. సోమవారం ఇరు వర్గాల వాదనలు వింటున్న ఎన్నికల కమిషన్ ఏ వర్గానికి అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం కేటాయిస్తుందో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.