అనర్హత ఎమ్మెల్యేల క్వాటర్స్ కు తాళం, అద్దెలు ఇవ్వండి, సుప్రీం కోర్టులో పిటిషన్ !
చెన్నై: తమిళనాడులోని ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి టీటీవీ దినకరన్ వర్గంతో చేతులు కలిపిన అన్నాడీఎంకే పార్టీకి చెందిన 18 మంది అన్నాడీఎంకే పార్టీ అనర్హత ఎమ్మెల్యేల క్వాటర్స్ కు తాళం వేశారు.
ఇంత కాలం క్వాటర్స్ వినిగించుకున్నందుకు అద్దె చెల్లించాలని అనర్హత ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్ నోటీసులు జారీ చేశారు. గత ఏడాది కాలంగా క్వాటర్స్ వినియోగించుకున్నందుకు అద్దెలు, అన్ని రకాల రుసుంలు చెల్లించాలని క్వాటర్స్ కు నోటీసులు అంటించారు.
ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేల మీద తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లోనే క్వాటర్స్ స్వాధీనం చేసుకోవాలని అధికారులు భావించారు. అయితే చివరి నిమిషంలో అధికారులు వెనక్కి తగ్గారు.
మద్రాసు హైకోర్టులో 18 మంది అనర్హత ఎమ్మెల్యేలకు చుక్కెదురుకావడంతో తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్ ఇప్పుడు రంగంలోకి దిగారు. మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ 18 మంది అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నారు.
మరో వైపు అన్నాడీఎంకే పార్టీతో పాటు డీఎంకే, టీటీవీ దినకరన్ కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) తదితర పార్టీలు ఉప ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. టీటీవీ దినకరన్ ను నమ్ముకుని ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం అయోమయంలో పడిపోయారు.