మోడీ మాటలతో పేదల కడుపు నిండదు, కర్ణాటక ప్రభుత్వం దేశంలో నెంబర్ వన్: సోనియా గాంధీ !
బెంగళూరు: కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని, పేదల కోసం అనే పథకాలు అమలు చేశారని ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని, అయితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులకు ఇలాంటివి ఏమీ కనపడటం లేదని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నాయకుల మీద సోనియా గాంధీ మండిపడ్డారు. మంగళవారం విజయపురలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించిన వారిని కనుమరుగు చేస్తారని ఆరోపించారు. నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఏం చేసిందని సోనియా గాంధీ ప్రశ్నించారు.
రైతుల వ్యతిరేకి మోడీ
కర్ణాటకలో కరువుతో రైతులు అల్లాడిపోయారని, ప్రధాని నరేంద్ర మోడీ అన్నదాతల ఆర్తనాదాలను పట్టించుకోలేదని సోనియా గాంధీ ఆరోపించారు. రైతులకు మద్దతుగా అండగా నిలిచిన సిద్దరామయ్యతో భేటీ కావడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిరాకరించారని, రైతు కుటుంభాలను ఆయన అవమానించారని సోనియా గాంధీ ఆరోపించారు.
కర్ణాటక మీద కోపం
కరువు ఉన్న రాష్ట్రాలకు రూ. వేల కోట్ల నిధులు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక గురించి పట్టించుకోలేదని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే కోపంతో ఈ రాష్ట్రంలోని రైతులకు అన్యాయం చేశారని సోనియా గాంధీ విమర్శించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే ఇదేనా ప్రధాని మోడీ అని సోనియా గాంధీ నిలదీశారు.
మోడీలో భూతం చేరింది
ప్రధాని నరేంద్ర మోడీ శరీరంలో కాంగ్రెస్ ముక్త భారత్ అనే భూతం చేరిందని, కాంగ్రెస్ ను కనుమరుగు చెయ్యడమే కాదు వారిని (మోడీ) ప్రశ్నించిన వారిని కనుమరుగు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని సోనియా గాంధీ ఆరోపించారు. బీజేపీని, అవినీతిని, సమస్యలను ప్రశ్నిస్తే మోడీ సహించలేరని సోనియా గాంధీ ఆరోపించారు.
మాటలతో కడుపు నిండుతుందా !
ప్రధాని మోడీ చాల చక్కగా మాట్లాడుతారని తాము అంగీకరిస్తున్నామని, అయితే మీ మాటలతో పేద ప్రజల కడుపు నిండుతుంది అంటే మీరు ఇంకా మాట్లాడవచ్చని సోనియా గాంధీ ఎద్దేవ చేశారు. దేశంలోని సమస్యలను తప్పుదోవ పట్టించడానికి ప్రధాని మోడీ తన ప్రసంగాలతో ప్రజలను మాయ చేస్తున్నారని సోనియా గాంధీ ఆరోపించారు.
దేశంలో ధరలు పెరిగిపోయాయి
దేశంలో నిత్యవసర ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోనియా గాంధీ ఆరోపించారు. మోడీ నిర్లక్షం వలన నేడు పెట్రోల్, డీసెల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయని, కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం ధరలు పెంచకుండా ప్రజలను ఆదుకున్నారని సోనియా గాంధీ చెప్పారు.
మీరు చేసిన సేవ ఏమిటి
నాలుగు సంవత్సరాల్లో ప్రధాని మోడీ ప్రజలకు ఏమి చేశారని సోనియా గాంధీ ప్రశ్నించారు. రైతులు, పేదలు, మహిళల కోసం మీరు ఏమీ చేశారని ప్రధాని నరేంద్ర మోడీని సోనియా గాంధీ నిలదీశారు. బసవణ్ణ తత్వాలను ఆదర్శంగా తీసుకుని ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సేవ చేసిందని, వారి సమస్యలు తీర్చిందని, కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వానికి అదే తేడా అని సోనియా గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని సోనియా గాంధీ మనవి చేశారు.