CM of Punjab: ట్విస్టుల మీద ట్విస్టులు: పొలిటికల్ థ్రిల్లర్కు తెర: ముఖ్యమంత్రి పేరు ఖరారు
చండీగఢ్: వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోన్నాయి. అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ పొలిటికల్ హైడ్రామాకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. తొలుత- పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధు పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేయడంతోనే భారీ మార్పులు ఉండొచ్చనే సంకేతాలు వెలువడ్డాయి.
సమూల మార్పు..
దీనికి అనుగుణంగా ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేసింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటుందని తొలుత వార్తలొచ్చాయి. అంచనాలు వెలువడ్డాయి. మార్పులనేవి పీసీసీ అధ్యక్ష పదవి, పార్టీపరంగానే ఉంటాయని భావించారు విశ్లేషకులు. వాటన్నింటినీ పటాపంచలు చేసింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్పై వేటు వేసింది.
ఈ మధ్యాహ్నానికి
శనివారం నాడే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన వారసుడిగా కాంగ్రెస్ పార్టీ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉంది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ- ఇంకాస్సేపట్లో ఆరంభం కానుంది. కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. కేంద్ర పరిశీలకులుగా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్రమంత్రులు హాజరు కానున్నారు. ఈ మధ్యాహ్నానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఖరారు కానుంది.
ఆయన పేరు ఖరారు..
కాగా- అనేక ట్విస్టుల మధ్య కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం.. పంజాబ్కు కాబోయే ముఖ్యమంత్రి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని పార్టీ అధిష్ఠానం రద్దు చేసింది. దీనితో ఈ సీన్ మొత్తం దేశ రాజధానికి మారింది. ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది. తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోని వంటి సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. పంజాబ్ కాంగ్రెస్ శాసనసభ్యులందరూ దీనికి హాజరయ్యారు. వారందరితో చర్చించిన తరువాత పేరును ఖరారు చేశారు.
సుఖ్జీందర్ సింగ్ రంధవా ఖాయం..
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. సుఖ్జీందర్ సింగ్ రంధవా పేరును ఖరారు చేశారు. దీనికి కాంగ్రెస్ సభాపక్ష నేతలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. సుఖ్జీందర్ సింగ్ రంధవా.. ప్రస్తుతం పంజాబ్ సహకార శాఖ మంత్రిగా పనిచేస్తోన్నారు. కేప్టెన్ అమరీందర్ సింగ్ కేబినెట్లో నంబర్ టుగా ఉంటున్నారు. సుఖ్జీందర్ సింగ్ రంధవా పేరు పట్ల ఏ శాసన సభ్యుడు కూడా అసమ్మతి తెలియజేయలేదని తెలుస్తోంది. ఆయన పేరు పట్ల ఏకగ్రీవ ఆమోదం తెలియజేశారని పేర్కొన్నారు.
Recommended Video
డేరా బాబా నానక్ ఎమ్మెల్యేగా
డేరా బాబా నానక్ నియోజకవర్గానికి సుఖ్జీందర్ సింగ్ రంధవా ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. భౌగోళికంగా పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండే నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి ఆయన రెండుసార్లు ఎన్నికయ్యారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. సుదీర్ఘకాలం నుంచి ఆయన కుటుంబం.. కాంగ్రెస్తో కలిసి సాగుతోంది. రంధవా తండ్రి కూడా కాంగ్రెస్లో అనేక హోదాల్లో పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అనుయాయుడిగా పేరుంది ఆయనకు.