రాహుల్ గాంధీ సైకిల్ సవారి, పెట్రోల్ ధరలపై నిరస, ఎడ్లబండిలో, మోడీ ఉపన్యాసాలు చాలు !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైకిల్ సవారి చేసి కేంద్ర ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మే 12వ తేదీన కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మోడీజీ ఇక మీ ఉపన్యాసాలు చాలు అని రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ సైకిల్ సవారి
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీ కోలారు పట్టణంలో, కోలారు జిల్లా మాలురులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సైకిల్ సవారి చేసిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు.
జీఎస్టీ దెబ్బతో ధరలు
దేశంలో పెట్రోల్, డీసెల్ గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేసిన తరువాత ధరలు అధికం అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఎడ్ల బండిలో రాహుల్ గాంధీ
కోలారు జిల్లా మాలూరులో కాంగ్రేస్ పార్టీ ఏర్పాటు చేసిన ర్యాలీలో సైకిల్ సవారి చేసిన రాహుల్ గాంధీ తరువాత ఎడ్ల బండి మీద సంచరించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని మనవి చేశారు. బీజేపీకి ఓటు వేసి అవినీతిపరులకు పట్టంకట్టకూడదని రాహుల్ గాంధీ మనవి చేశారు.
మోడీ ఉపన్యాసాలు
ప్రధాని నరేంద్ర మోడీ పక్కనే జైలుకు వెళ్లి వచ్చిన వారు ఉంటారని, అయితే ఆయన మాత్రం ప్రతిపక్షాలు అవినీతికి పాల్పుడుతున్నాయి అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారని రాహుల్ గాంధీ ఎద్దేవ చేశారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా కోలారు, మాలూరులో గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.