జయ మృతి: గౌతమి ద్వారా కుట్ర?, ఎదురుదాడి
జయలలిత మృతిపై ప్రధాని మోడీకి సినీ నటి గౌతమి లేఖ రాయడం వెనక కుట్ర దాగి ఉందా... అవునంటూ అన్నాడియంకె నేతలు గౌతమిపై ఎదురు దాడికి దిగుతున్నారు.
చెన్నై: జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సినీ నటి గౌతమి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం వెనక కుట్ర దాగి ఉందనే ఆరోపణలు ముందుకు వస్తున్నాయి. ఈ వాదనతో అన్నాడియంకె నేతలు వరుసగా గౌతమిపై ఎదురు దాడికి దిగుతున్నారు. దీంతో గౌతమి చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నారు.
తాను లేఖ రాయడం వెనక ఎవరూ లేరని గౌతమి చెప్పినప్పటికీ అన్నాడియంకె నేతలు వినడం లేదు. ఓ పౌరురాలిగా మాత్రమే తాను ప్రశ్నిస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ పార్టీపై కుట్ర సాగుతోందని, ఇందులో భాగంగానే గౌతమి కుట్రదారులకు అమ్ముడిపోయారని అన్నాడియంకె నేతలు విరుచుకుపడుతున్నారు.
గౌతమి సంధించిన ప్రశ్నలను ఎత్తి చూపుతూ తమ పార్టీపై కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే గౌతమి లేఖలు రాస్తున్నారని అన్నాడియంకె నేతలు అంటున్నారు. గౌతమి ప్రశ్నలు వేయడాన్ని అన్నాడియంకె అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ మీడియా సమావేశంలో ఖండించారు.
అమ్మకు ప్రపంచ స్థాయి వైద్యం
అమ్మ జయలలితకు ప్రపంచ స్థాయి వైద్యం అందించారనే విషాయన్ని గుర్తించాలని నాంజిల్ సంపత్ అన్నారు అమ్మ అనుమతి ఇస్తేనే ఇతరులు లోనికి వెళ్లగలరనే విషయాన్ని గౌతమి గుర్తించాలని అన్నారు. హద్దులు మీర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పార్టీలో చీలిక తెచ్చే కుట్రలో భాగంగానే గౌతమి ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. ఆ కుట్రకు గౌతమి అమ్ముడుపోయారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
గౌతమి తీరు సరికాదని సరస్వతి...
తమ పార్టీ వర్గాలు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నట్లుగా గౌతమి అనుమానాలు వ్యక్తం చేయడం శోచనీయమని అన్నాడియంకె మరో అధికార ప్రతనిధిత సిఆర్ సరస్వతి అన్నారు. తామే కాదు, జాతీయ స్థాయిలోని వివిధ పార్టీల నాయకులు అమ్మను పరామర్శించేందుకు వచ్చి ఆమె ఆరోగ్యంగా ఉన్నారని మీడియా ముందు చెప్పి వెళ్లిన విషయాన్ని గౌతమి గుర్తుకు తెచ్చుకోవాలని ్న్నారు గౌతమి అర్థరహితమైన అనుమానాలను మానుకుంటే మంచిదని అన్నారు.
మరో అధికార ప్రతినిధి కూడా గౌతమిపై...
గౌతమి వ్యాఖ్యలను అన్నాడియంకె మరో అధికార ప్రతినిధి దీరన్, మాజీ మంత్రి వలర్మతి, సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ తదితరులు ఖండిస్తూ ఎదురు దాడికి దిగారు. అయితే, గౌతమి వ్యాఖ్యలను నటుడు, మాజీ శాసనసభ్యుడు ఎస్వీ శేఖర్ సమర్థించారు. ప్రజల్లో అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనే విషయాన్ని గుర్తించాలని అన్నారు.
శశికళ చుట్టూ ఎందుకు...
జయలలిత స్నేహితురాలు శశికళకు అన్నాడియంకె నేతలు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారని పిఎంకె నేత రాందాస్ అడిగారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు అధికార వర్గాలు శశికళ చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నారని ఆయన అడిగారు. ఏ పదవిలో కూడా లేని శశికళకు ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారో తెలియడం లేదని అన్నారు. పన్నీరు సెల్వం ఇకనైనా ప్రజల పక్షాన నిలబడి తన బాధ్యతలను నిర్వహించే దిశగా సాగాలి గానీ భేటీ అంటూ ఆయనతో పాటు అధికార వర్గాలు పోయెస్ గార్డెన్ వైపుగా పరుగులు తీయడానికి స్వస్తి చెప్పాలని అన్నారు.