ఈ నెలలోనే కరోనా వ్యాక్సిన్కు అనుమతులు: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా
న్యూఢిల్లీ: భారతదేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. గురువారం ఓ మీడియా సంస్థతో జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ పరీక్షలు చివరి దశకు చేసుకున్న నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరులో లేక జనవరి ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెలలోనే అనుమతులు లభించే అవకాశం ఉందన్నారు.
వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి పూర్తి అనుమతులు పొందిన తర్వాత అధికారులు ప్రజలకు దాన్ని అందించే ప్రక్రియను ప్రారంభిస్తారని రణదీప్ గులేరియా చెప్పారు. వ్యాక్సిన్కు సంబంధించిన పనులన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయని తెలిపారు. వాటిని భద్రపరచేందుకు తగిన ఉష్ణోగ్రతలు, స్థలం, వ్యాక్సిన్ను ఇచ్చే వారికి శిక్షణ, సిరంజీల లభ్యత వంటి వాటిపై కసరత్తు చేస్తున్నాయని వివరించారు.
చెన్నైలో ఒక వాలంటీర్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం నారోగ్యానికి గురయ్యానని చేసిన ఆరోపణలపైనా గులేరియా స్పందించారు. పెద్ద సంఖ్యలో ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నారు. ప్రస్తుతం ఆ వాలంటీర్కు కలిగిన పరిస్థితికి వేరే అనారోగ్యాలు కారణం కావచ్చన్నారు. వ్యాక్సిన్ వల్ల అయితే కాదని గులేరియా స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ సురక్షితం అని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు. సుమారు 70,000-80,000 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ను వేసినా, ఇప్పటి వరకూ ఎవరికీ తీవ్ర దుష్ప్రభావాలు కలగలేదన్నారు. వ్యాక్సిన్ ఏదైనా సరే దీర్ఘకాలం తీసుకుంటేనే సమస్యలు ఎదురవుతాయన్నారు. ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని రణదీప్ గులేరియా తెలిపారు. ఈ విధంగానే మరో మూడు నెలలు కొనసాగితే మనం పెద్ద మార్పును గమనించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేగాక, ప్రతి ఒక్కరికీ ఇవ్వడానికి తగినంత మోతాదులో కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రారంభంలో లభించదని గులేరియా చెప్పారు. "కోవిడ్ కారణంగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికి మేము టీకాలు వేసేందుకు ప్రాధాన్యత ఇస్తాం. వారి జాబితా సిద్ధం చేయాల్సిన అవసంర ఉంది. వృద్ధులు, కొమొర్బిడిటీ ఉన్నవారు, ఫ్రంట్ లైన్ కార్మికులు ముందుగా టీకాలు వేయాలి" అని గులేరియా చెప్పారు.