అమ్మ జయలలితకు చికిత్స మేమే చేశాం, ఎయిమ్స్, శశికళ లాయర్ ప్రశ్నలు, ఆ రోజు!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నిపుణులైన వైద్యుల బృందం చికిత్స అందించిందని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతి కేసు విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు ఎయిమ్స్ వైద్యులు హాజరై వివరణ ఇచ్చారు. ఎయిమ్స్ వైద్యులకు వీకే. శశికళ న్యాయవాది ప్రశ్నల వర్షం కురిపించాడు.
ప్రముఖ వైద్యులు
ఢిల్లీలోని ఎయిమ్స్ కు చెందిన ప్రముఖ వైద్యులు జీసీ. కిలాని, అజంన్ టిక్రీ, నితీష్ నాయక్ చెన్నై చేరుకుని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మనవి మేరకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలితకు తాము చికిత్స అందించామని ముగ్గురు వైద్యులు జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు వివరణ ఇచ్చారు.
పన్నీర్ సెల్వం, తంబిదురై
జయలలితకు ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్న పూర్తి వివరాలను అప్పటి తమిళనాడు మంత్రి పన్నీర్ సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైకి వివరించామని ఎయిమ్స్ వైద్యులు వివరించారు. ఎయిమ్స్ వైద్యులను ఉదయం నుంచి సాయంత్రం వరకు వీకే. శశికళ న్యాయవాది ఎన్. రాజా సెంతూర్ పాండియన్ క్రాస్ ఎగ్జామ్ చేసి ప్రశ్నల వర్షం కురిపించారు.
డిసెంబర్ 3వ తేదీ అమ్మ
2016 డిసెంబర్ 5వ తేదీ జయలలిత చికిత్స విఫలమై అపోలో ఆసుపత్రిలో మరణించారు. అయితే డిసెంబర్ 3వ తేదీన జయలలిత ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉన్నారని, ఎవ్వరి సహాయం లేకుండా దాదాపు 20 నిమిషాలు ఆమె కుర్చున్నారని ఎయిమ్స్ వైద్యులు జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ కు సమాచారం ఇచ్చారని వీకే. శశికళ న్యాయవాది ఎన్. రాజా సెంతూర్ పాండియన్ మీడియాకు చెప్పారు.
వైద్యులకు సమన్లు
జయలలితకు ఎలాంటి చికిత్స అందించారు, ఆమె చికిత్సకు ఎలా స్పంధించారు అనే పూర్తి సమాచారం ఇవ్వడానికి విచారణ కమిషన్ ముందు హాజరుకావాలని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఎయిమ్స్ వైద్యులకు సమన్లు జారీ చేసింది. సమన్లు అందుకున్న ఎయిమ్స్ కు చెందిన ముగ్గురు వైద్య నిపుణులు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.