ముస్లింలకు తలదాచుకునే చోటు కూడా దక్కదు: పౌరసత్వ బిల్లు ప్రతులను చింపి, గాల్లోకి విసిరేసిన ఒవైసీ..!
Recommended Video
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్ సభలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. ఈ బిల్లుపై ఓటింగ్ ముగిసిన తరువాత సోమవారం రాత్రి వరకూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటనపై చర్చ సందర్భంగా.. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సవరణ బిల్లు ప్రతులను చింపి, గాల్లోకి విసిరేశారు.
ముస్లింలు నిరాశ్రయులవుతారంటూ..
పౌరసత్వ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేయడం వల్ల ముస్లింలు నిరాశ్రయులవుతారని ఒవైసీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అఖండ భారతావనిలో తలదాచుకోవడానికి చోటు కూడా లభించదని అన్నారు.
ముస్లింలను నిరాశ్రయులను చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కుట్ర పన్నిందని విమర్శించారు. దక్షిణాఫ్రికాలో మహాత్మగాంధీపై చూపించిన జాతి వివక్ష తరహా ఉదంతాలు దేశవ్యాప్తంగా తలెత్తుతాయని అన్నారు.
జాతి వివక్షకు తెర తీసినట్టవుతుంది..
పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేయకూడదని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమౌతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ముస్లింలు ఏ రాష్ట్రానికి చెందిన వారు కాకుండా పోతారని మండిపడ్డారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ వంటి దేశాలకు చెందిన ముస్లింలను బిల్లులో చేర్చిన కేంద్ర ప్రభుత్వం.. చైనాను ఎందుకు విస్మరించిందని ప్రశ్నించారు. చైనా అంటే భయపడుతున్నారా? అని నిలదీశారు.