బుర్ఖాలు సరే..పరదాలను నిషేధించమని డిమాండ్ చేయగలరా? : ఒవైసీ
హైదరాబాద్: దేశంలో లోక్ సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో.. సరికొత్త వివాదం రాజుకుంది. ముస్లిం మహిళలు బుర్ఖాలు ధరించకుండా నిషేధం విధించాలంటూ శివసేన చేసిన డిమాండ్ దీనికి కేంద్రబిందువైంది. శివసేన లేవనెత్తిన ఈ డిమాండ్ పట్ల దేశవ్యాప్తంగా ముస్లింలు మండిపడుతున్నారు. ఈ డిమాండ్ ను సంఘ్ పరివార్ దీన్ని స్వాగతిస్తోంది. దేశంలో మరో మూడు దశల పోలింగ్ మిగిలి ఉన్నందున.. రాజకీయంగా లబ్ది పొందడానికి బీజేపీయేతర రాజకీయ పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. బుర్ఖాలను నిషేధించాలన్న డిమాండ్ ను తమ ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నాయి.
ఈస్టర్ సండే నాడు శ్రీలంకలో రాజధాని కొలంబో సహా పలు ప్రాంతాల్లోని చర్చిలు, హోటళ్లపై వరుసగా ఆత్మాహూతి దాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మొత్తం 253 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన అనంతరం- శ్రీలంక ప్రభుత్వం బుర్ఖాలను ధరించడాన్ని నిషేధిచింది. తమ ముఖాన్ని దాచుకునేలా ఎలాంటి వస్త్రాల ధరించ కూడదంటూ ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.
దీన్ని దృష్టిలో ఉంచుకుని.. భారత్ లోనూ బుర్ఖాలను ధరించడంపై నిషేధం విధించాలనే డిమాండ్ లేవనెత్తింది శివసేన. బుర్ఖాల మాటున ఎవరు ఉన్నది తెలియట్లేదని, అసాంఘిక శక్తులు ఈ విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని శివసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శివసేన చేసిన ఈ ప్రకటన రాజకీయ పార్టీల్లో ప్రకంపనలను పుట్టించింది. బీజేపీయేతర, ఎన్డీయేతర పార్టీల నాయకులు తమ విమర్శల తీవ్రతను పెంచాయి. శివసేనతో పాటు బీజేపీపైనా నిప్పులు చెరుగుతున్నాయి.
పరదాలను నిషేధించాలని డిమాండ్ చేయగలరా?
శివసేన డిమాండ్ ను మజ్లిస్ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు. అతివాద లక్షణంగా అభివర్ణించారు. పరదాల రూపంలో హిందువుల్లో కూడా ముఖాన్ని దాచుకునే సంప్రదాయం ఉందని, దీన్ని నిషేధించమని డిమాండ్ చేయగలరా? అంటూ ఆయన శివసేనను నిలదీశారు. బుర్ఖాలను ధరించడం రాజ్యాంగ బద్ధమని, రాజ్యంగమే ఈ రక్షణను కల్పించిందని చెప్పారు. శివసేన చేసిన ప్రకటన రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టవుతుందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కూడా ఉల్లంఘించడమేనని, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించే అర్హత ఎవ్వరికీ లేదని చెప్పారు. వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లకూడదంటూ సుప్రీంకోర్టు కూడా గతంలో తీర్పులు ఇచ్చిందని ఒవైసీ గుర్తు చేశారు.