డీఎంకెతో ఎంఐఎం పొత్తు..? కుదరకపోతే ఒంటరిగానే... తమిళ గడ్డపై మజ్లిస్ మ్యాజిక్ పనిచేస్తుందా?
గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం పార్టీ... ఈ ఏడాది జరగబోయే తమిళనాడు,బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పొత్తుకు విముఖత చూపడంతో అక్కడ ఎంఐఎం ఒంటరిగానే బరిలో దిగుతోంది. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకెతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న ఆ పార్టీ.. ఒకవేళ కుదరకపోతే అక్కడ కూడా ఒంటరిగానే బరిలో దిగే అవకాశం ఉంది.
డీఎంకెతో పొత్తు...?
నిజానికి ఇప్పటికే ఎంఐఎం డీఎంకెను సంప్రదించినప్పటికీ అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఇండియన్ ముస్లిం లీగ్ డీఎంకెతో పొత్తు కుదుర్చుకోవడం... ఆ పార్టీకి 3 సీట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి మరో ముస్లిం పార్టీని కూటమిలో చేర్చుకునేందుకు డీఎంకె సుముఖత చూపకపోవచ్చు. అదే జరిగితే ఎంఐఎం ఒంటరిగా బరిలో దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
తాజాగా తమిళనాడు ఎంఐఎం చీఫ్ వకీల్ అహ్మద్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాము పోటీ చేయబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం డీఎంకెతో చర్చలు జరుపుతున్నామని... ఒకవేళ అవి సఫలం కాకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. అన్నాడీఎంకెతో పొత్తు ఆలోచనే లేదన్నారు.
రాష్ట్రంలో ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం లేదు : ఎంఐఎం
ఎంఐఎం అధికార ప్రతినిధి మసూద్ ఖాన్ ఒక ప్రశ్నకు బదులిస్తూ... ఇతర ముస్లిం పార్టీలు ఎంఐఎంను చూసి భయపడుతున్నాయని అన్నారు. ఓవైసీ లాంటి బలమైన నేత తమ పార్టీకి ఉండటమే అందుకు కారణమన్నారు. తమిళనాడులో ముస్లిం జనాభాకు తగినట్లుగా చట్ట సభల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించాలన్నదే ఎంఐఎం ఎజెండా అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 9శాతం ముస్లిం జనాభాను పరిగణలోకి తీసుకుంటే కనీసం 25 స్థానాల్లో వారికి ప్రాతినిధ్యం ఉండాలని... కానీ తమిళనాడులోని ముస్లిం పార్టీలు కేవలం 3 సీట్లతోనే సంతృప్తి చెందుతున్నాయని అన్నారు. పరోక్షంగా ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీని ఆయన ఎద్దేవా చేశారు. మార్చి 7వ తేదీన ఎంఐఎం అభ్యర్థులను ప్రకటిస్తుందని... పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమిళనాడులో ప్రచారం చేస్తారని చెప్పారు.
తమిళ గడ్డపై సత్తా చాటేనా?
తమిళనాడులో ఉర్దూ మాట్లాడే జనాభా వరకే ఎంఐఎం పరిమితమవుతుందన్న వాదనను మసూద్ ఖాన్ కొట్టిపారేశారు. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ హిస్టరీ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. ఉత్తరాదిలో ఓవైసీ లాంటి దూకుడైన నాయకుడు అవసరమేమో గానీ తమిళనాడులో అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని రెండు ద్రవిడ పార్టీలు ముస్లింల సమస్యలపై సరిగానే స్పందిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బిహార్లో లాగా ఎంఐఎం ఇక్కడ కూడా మ్యాజిక్ చేయగలదా.. లేదా అన్నది తెలియాలంటే మే 2వ తేదీ వరకూ ఆగాల్సిందే. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం పొత్తులు,అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. అటు డీఎంకె కాంగ్రెస్లతో కూడిన యూపీఏ,ఇటు అన్నాడీఎంకె,బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటములు ఇప్పటికే సీట్ల కేటాయింపులపై చర్చలు ప్రారంభించాయి. ఈ రెండు కూటముల్లో మున్ముందు మరిన్ని పార్టీలు చేరే అవకాశం ఉంది.