మజ్లిస్కు చేదు అనుభవాలు తప్పనట్టేనా? 44 చోట్ల పోటీ.. మూడు స్థానాల్లో లీడింగ్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిల్చున్న అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కు చేదు అనుభవాలు తప్పేల లేవు. ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడా కూడా ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఒక్క స్థానంలో మాత్రమే మజ్లిస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. మెజారిటీ స్వల్పమే కావడం వల్ల చివరికి ఆ ఫలితం తలకిందులయ్యే అవకాశాలు ఉన్నాయి. మజ్లిస్ కు జాతీయ హోదా ఉన్న నేపథ్యంలో.. ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న రాష్ట్రల్లో ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తోంది.
ఫలితం చూపని మజ్లిస్..
2014 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు స్థానాలను గెలుచుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వారిస్ పఠాన్ బైకుల్లా, ఔరంగాబాద్ సెంట్రల్ స్థానాలను గెలుచుకోగలిగింది. తాజాగా ఫలితాల్లో ఆ స్థానం సహా దాదాపు అన్ని చోట్ల కూడా మజ్లిస్ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. వారిస్ పఠాన్ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, మజ్లిస్ అభ్యర్థి వారిస్ యూసుఫ్ పఠాన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అన్నా మధు చవాన్ లీడింగ్ లో ఉన్నారు. 2014 ఎన్నికల్లో మజ్లిస్ మొత్తం 24 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది.
44 స్థానాల్లో అభ్యర్థులు..
ఈ సారి ఆ సంఖ్యను గణనీయంగా పెంచింది. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 44 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు.
ప్రముఖ సంఘ సేవకుడు ప్రకాశ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన వంచిత్ బహుజన్ అఘాడి ( వీబీఏ)తో మజ్లిస్ పార్టీ పొత్తు పెట్టుకున్నారు. అయినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపలేదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడే ప్రకాశ్ అంబేద్కర్. వీబీఏతో పొత్తు పెట్టుకోవడం వల్ల దళితులు, మైనారిటీలో ఓట్లు చీలవని మజ్లిస్ నాయకులు అంచనా వేస్తున్నారు. దళితుల ఓట్లు తమకే పడతాయని ఆశించారు. వీబీఏతో మజ్లిస్ పొత్తు పెట్టుకోవడం ఇదే తొలిసారి. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. కొన్ని నియోజకవర్గాల్లో మజ్లిస్ కంటే అధిక ఓట్లను సాధించింది వీబీఏ. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓట్లు చీలకుండా ఉండటానికి ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. అయినప్పటికీ.. భారతీయ జనతాపార్టీ-శివసేన, కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మధ్య ప్రభావాన్ని చూపలేకపోయారు మజ్లిస్ అభ్యర్థులు.
పరిధిని విస్తరించుకోవాలనుకున్న ప్రయత్నాలకు విఘాతమే.
ఈ సారి హిందువుల ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నియెజకవర్గాల్లో మజ్లిస్ తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. వీబీఏతో కుదుర్చుకున్న పొత్తు ఫలితంగా తన పరిధులను దాటుకుని మజ్లిస్.. హిందువుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లోనూ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించింది. అవన్నీ బెడిసి కొట్టినట్టే కనిపిస్తోంది. స్థానికంగా మంచి పేరు ఉన్న అభ్యర్థులను నిలబెట్టామని మహారాష్ట్ర మజ్లిస్ విభాగం నాయకులు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్లే వారిని, ఉన్నత విద్యావంతులకు టికెట్లు ఇచ్చామని, ఖచ్చితంగా ఆశించిన ఫలితాలు వెలువడుతాయని మజ్లిస్ నేతలు ఆశించినప్పటికీ.. ఫలితాలు మత్రం వేరుగా వెలువడుతున్నాయి.