జామియా కాల్పులు.. కేంద్ర మంత్రికి థ్యాంక్స్ చెప్పిన ఓవైసీ.. పోలీసులకు ప్రైజ్ అంటూ తీవ్ర విమర్శలు
పట్టపగలు.. వందలాదిమంది పోలీసులు చూస్తుండగా.. తుపాకితో దూసుకొచ్చిన ఓ వ్యక్తి.. జామియా యూనివర్సిటీ వద్ద.. సీఏఏ వ్యతిరేక నిరసనలు చేస్తోన్న విద్యార్థులపై గురువారం కాల్పులు జరిపిన ఘటన సంచలనం రేపిందింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ''సీఏఏ వ్యతిరేక నిరసనకారులు దేశద్రోహులు.. వాళ్లను కాల్చిపారేయండి..(దేశ్ కే గద్దారోంకో.. గోలీ మారో సాలోంకో)'' అంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రెచ్చగొట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందటూ ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. జామియా కాల్పుల నేపథ్యంలో బీజేపీ, ఢిల్లీ పోలీసులను ఉద్దేశించి ఆయన సంచలన కామెంట్లు చేశారు.
హాయ్ మోదీ.. అతన్ని గుర్తుపట్టారా?
‘‘ముందుగా మంత్రి అనురాగ్ ఠాకూర్కు, దేశంలోని జాతీయవాదులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేశంలో ఇంతగా విద్వేషాన్ని రగిలించి.. టెర్రరిస్టులతో విద్యార్తులపై కాల్పులు జరిపించారు.. అది కూడా వందలమంది పోలీసులు చూస్తుండగానే!! హాయ్ మోదీ.. వేసుకున్న దుస్తులను బట్టి కాల్పులు చేసిన వ్యక్తి ఎవరో గుర్తించగలరా? సరిగ్గా మహాత్మా గాంధీని గాడ్సే కాల్చిచంపిన రోజే ఈ సంఘటన జరగడం గమనార్హం''అని ఓవైసీ విమర్శించారు.
పోలీసులకు ఏ చట్టం అడ్డొచ్చిందో..
గతంలో జామియా యూనివర్సిటీలోకి చొరబడిమరీ విద్యార్థులపై కాల్పులు, లాఠీచార్జి జరపడాన్ని గుర్తుచేస్తూ ఢిల్లీ పోలీసులపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఢిల్లీ పోలీసులూ.. కిందటినెలలో ఇదే జామియాలో మీరు చూపించిన ప్రతాపం, సాహసం ఏమయ్యాయి? నిస్సహాయంగా నిలబడి చూసే ప్రేక్షకులకు కూడా ఏదైనా బహుమానాలు(ప్రైజ్) దక్కితే.. ప్రతీసారి అవన్నీ మీకే సొంతమవుతాయి. సాయుధుణ్ని అడ్డుకోవాల్సిందిపోయి.. గాయపడ్డ నిరసనకారుణ్ని బ్యారికేండ్లు ఎందుకు ఎక్కిచారో కాస్త వివరిస్తారా?''అంటూ మండిపడ్డారు.
వెనక్కి తగ్గేదేలేదు..
బీజేపీ కుట్రలు, అనురాగ్ ఠాకూర్ ప్రేరణతోనే జామియా విద్యార్థులపై కాల్పులు జరిగాయన్న అసదుద్దీన్ ఓవైసీ.. అంతమాత్రానికే భయపడిపోయి నిరసనలు ఆపబోమని స్పష్టం చేశారు. టెర్రరిస్టులు, సాయుధ ముష్కరులు భారతీయులను భయపెట్టలేరని, సీఏఏ వ్యతిరేక ఆందోళనలను ఇకపైనా కొనసాగుతాయని, ఇది గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఐడియాలజీకి.. టెర్రరిస్టు గాడ్సే ఐడియాలజీకి జరుగుతున్న పోరాటమని ఓవైసీ చెప్పారు.
పోలీసుల అదుపులో నిందితుడు..
సౌత్ ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ దగ్గర శాంతియుత నిరసన తెలుపుతోన్న విద్యార్థులపై గురువారం మధ్యాహ్నం కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని గోపాల్ శర్మగా పోలీసులు గుర్తించారు. అతను ఉత్తరప్రదేశ్ లోని గౌతంబుద్ధ నగర్ కు చెందినవాడని, కాల్పుల తర్వాత అతణ్ని అరెస్టుచేసి ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. కాల్పుల్లో గాయపడ్డ విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.