జేఎన్యూ హింసాకాండ : మోదీ సర్కార్ సమాధానం చెప్పాలన్న అసదుద్దీన్ ఓవైసీ
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో జరిగిన హింసాకాండపై మజ్లిస్ పార్టీ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. జేఎన్యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన ఆయన.. దాడి ఘటనను ఖండించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఎదురొడ్డి నిలబడినందుకే వారిపై దాడి చేసినట్టుగా స్పష్టమవుతోందన్నారు. దాడిపై కేంద్రమంత్రులే నిస్సహాయంగా ట్వీట్స్ చేస్తుండటం దురదృష్టకరం అన్నారు. క్యాంపస్లోకి ముసుగులు వేసుకుని గూండాలు ప్రవేశిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. గూండాలతో పోలీసులు ఎందుకు ఉన్నారని నిలదీశారు. మోదీ సర్కార్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ జేఎన్యూ ఘటనపై కాంగ్రెస్,కమ్యూనిస్టు,ఆమ్ ఆద్మీ పార్టీలను నిందించారు. ఈ మూడు పార్టీలు కలిసి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో అశాంతిని రేకెత్తిస్తున్నాయని ఆరోపించారు. జేఎన్యూ దాడి వెనుక కుట్ర దాగుందని,అది కచ్చితంగా బయటపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై విచారణ జరపాలన్నారు.
జేఎన్యూ ఘటనను ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ,పినరయి విజయన్ సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే ఖండించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు. ఒకప్పటి హీరోయిన్,అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా 'ఇక్కడ విద్యార్థుల కంటే ఆవులకే రక్షణ ఉంది' అంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. నటి తాప్సీ పన్ను,దర్శకుడు అనురాగ్ కశ్యప్,నటి షబానా అజ్మీ,నటుడు రితేశ్ దేశ్ముఖ్లు కూడా జేఎన్యూ ఘటనను తీవ్రంగా ఖండించారు. భారత బ్యాడ్మింటన్ మాజీ స్టార్ గుత్తా జ్వాల కూడా జేఎన్యూ దాడిని ఖండించారు. ఇంత జరుగుతున్నా మౌనంగానే ఉందామా అంటూ ప్రశ్నించారు. దాడి చేసిన మూకలో ఓ మహిళ కూడా ఉందంటూ గుత్తా జ్వాలా ఓ వీడియోను కూడా ట్విట్టర్లో పోస్టు చేశారు.