ఉత్తర ప్రదేశ్ బరిలో మజ్లిస్: తొలి జాబితా ఇదే: గెలుపు గుర్రాలకు టికెట్లు
లక్నో: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇదివరకే వెలువడటంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలపై దృష్టి సారించాయి. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. తొలిదశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమౌతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించేలా షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న ఆంక్షలు కొంత అడ్డంకిగా మారినప్పటికీ- నియోజకవర్గ స్థాయిలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహిస్తోన్నాయి. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతి పెద్ద రాష్ట్రం కావడం వల్ల ఉత్తర ప్రదేశ్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 7, 14, 20, 23, 27, మార్చి 3,7 తేదీల్లో పోలింగ్ ఉంటుంది.
కాగా- ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సమాయాత్తమైంది. ఎన్నికల్లో పోటీ చేసే తొలి విడత అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ మేరు తొలి జాబితా అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ జాబితాను కొద్దిసేపటి కిందటే ఉత్తర ప్రదేశ్ ఏఐఎంఐఎం అధ్యక్షుడు షౌకత్ అలీ విడుదల చేశారు. 50కి పైగా స్థానాల్లో మజ్లిస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తొమ్మిదిమంది అభ్యర్థులతో తొలి విడతను జారీ చేసింది మజ్లిస్. ఇందులో డాక్టర్ మహతాబ్-లోని, (ఘాజియాబాద్), ఫుర్కాన్ చౌదరి-గర్హ్ ముక్తేశ్వర్ (హపుర్), హాజీ ఆరిఫ్-ధౌలానా (హపుర్), రఫత్ ఖాన్-సివాల్ ఖాస్ (మీరట్), జీషన్ ఆలమ్-సరధాన (మీరట్), తస్లీమ్ అహ్మద్-కిథోరె (మీరట్), అమ్జాద్ అలీ-బేహత్ (సహరాన్పూర్), షహీన్ రజా ఖాన్ (రాజు)-బరేలీ, మర్గూబ్ హసన్-సహరాన్పూర్ దేహత్ (సహరాన్పూర్) పోటీ చేయనున్నారు.