అయోధ్య తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు సంచలనం: డిసెంబర్ మొదటివారంలో..!
లక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సవాల్ చేయనుంది. సుప్రీంకోర్టు వెలువడించిన తీర్పును పున: సమీక్షించాలని కోరనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. డిసెంబర్ మొదటి వారంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించింది.
సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు నిర్ణయం తరువాతే..
అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయకూడదని, అయిదు ఎకరాల స్థలాన్ని స్వీకరించాలని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకున్న 24 గంటల్లోనే ముస్లిం పర్సనల్ లా బోర్డు రంగ ప్రవేశం చేసింది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఇక తాము రివ్యూ పిటీషన్ ను వేస్తామని ప్రకటించింది. దీనికోసం న్యాయపరమైన ప్రక్రియను ఆరంభించినట్లు పేర్కొంది. డిసెంబర్ మొదటివారంలో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుపై సవాల్
ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో 500 సంవత్సరాలుగా వివాదానికి కేంద్రబిందువుగా ఉంటూ వచ్చిన 2.77 ఎకరాల స్థలం రామ్ లల్లా విరాజమాన్ కు చెందుతుందని సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీన చారిత్రాత్మక తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థలానికి ప్రత్యామ్నాయంగా ముస్లింలకు అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సారథ్యంలోని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
వద్దనుకున్న సున్నీ వక్ఫ్ బోర్డు..
ఈ తీర్పుపై సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అసంతృప్తిని వ్యక్తం చేసింది. రివ్యూకు వెళ్తామని ప్రకటించింది. మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్వహించిన సెంట్రల్ కమిటీ సమావేశం సందర్భంగా.. సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. రివ్యూ పిటీషన్ దాఖలు చేయకూడదని తీర్మానించారు. వక్ఫ్ బోర్డు తన నిర్ణయాన్ని వెల్లడించిన 24 గంటల్లోనే ముస్లిం పర్సనల్ లా బోర్డు తెర మీదికి వచ్చింది. తాము రివ్యూకు వెళ్తామని ప్రకటించింది.