నేను సెలబ్రిటీని, తిడతారా: ఎయిర్ పోర్ట్లో యువతి హంగామా
ముంబై: తాను సెలబ్రిటీని అని, తనను అసలు పట్టించుకోవడం లేదని ఓ యువతి విమానాశ్రయంలో హంగామా సృష్టించింది. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. గో ఎయిర్ విమానం ముంబై నుంచి లక్నోకు వెళ్తున్న సమయంలో చోటు చేసుకుంది.
తాను సెలబ్రిటీని అని, విమానయాన స్టాఫ్ తనను అసలు పట్టించుకోవడం లేదని ఆమె గోల పెట్టింది. లక్నోకు బయలుదేరాల్సిన విమానం 387 బోర్డింగ్కు సిద్ధమైంది. అప్పుడే సీమా అహూజా అనే యువతి ఎయిర్ లైన్స్ ఉద్యోగులపై కేకలు వేయడం ప్రారంభించింది.
రెండు చేతుల్లో రెండు బ్యాగ్స్తో ఆమె వచ్చింది. వాటిని విమానంలోకి చేర్చేందుకు సహాయకుడిని ఇవ్వాలని కోరడంతో గొడవ మొదలైనట్టు ఇతర ప్రయాణికులు తెలిపారు. తాను ఓ సెలబ్రిటీనని, గో ఎయిర్ ఉద్యోగులు తనను తూలనాడారని, సరిగ్గా చూసుకోలేదని ఆరోపించారు.
ఆమె పెద్దగా కేకలు వేసింది. బోర్డింగ్ కోసం వేచి చూస్తున్న వారు సైతం ఆశ్చర్యపోయారు. బ్యాగులను విమానంలోకి చేర్చే ఏర్పాట్లు చేస్తామని సిబ్బంది చెప్పినా వినలేదు. దీంతో ఫ్లయిట్ కమాండర్ ఆమెను ఎక్కించుకునేందుకు అంగీకరించ లేదు. ఉదయం 9:50కి విమానం టేకాఫ్ అయింది.