పాకిస్తాన్ పై భారత్ దాడికి దిగబోతోందా? ఆ లేఖ సారాంశం అదేనా?
పాకిస్తాన్ పై అదను చూసుకుని భారత్ యుద్ధానికి దిగబోతోందా? పాక్ కు భారత్ సత్తా ఏమిటో రుచి చూపించాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోందా?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పై అదను చూసుకుని భారత్ యుద్ధానికి దిగబోతోందా? నియంత్రణ రేఖ వద్ద యధేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడుతూ భారత సైనికులను పొట్టనబెట్టుకుంటున్న పాక్ కు భారత్ సత్తా ఏమిటో రుచి చూపించాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోందా?
ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది ఓ జాతీయ మీడియా సంస్థ. ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించిన ఈ సంస్థ త్వరలోనే పాక్ పై భారత్ దాడికి దిగే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది.
అవును, ఆ లేఖ సారాంశమదే...
ఇందుకు ఈ మీడియా సంస్థ నెల రోజుల క్రితం భారత వాయుసేన దళపతి బీఎస్ ధనోవా భారత వాయు సేన(ఐఏఎఫ్)లో పని చేసే 12 వేల మంది అధికారులకు రాసిన ఓ లేఖను ఉటంకిస్తోంది. ధనోవా లేఖను విశ్లేషించిన నిపుణులు.. పాకిస్తాన్తో యుద్ధం గురించే ఎయిర్ చీఫ్ ఈ లేఖను అధికారులకు రాసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు చేస్తున్న దాడులను అడ్డుకునేందుకు వాయుసేనను త్వరలో రంగంలోకి దింపబోతున్నారనడానికి ఈ లేఖ సంకేతమని అంటున్నారు.
అందులో ఏం రాశారంటే..
'అతి కొద్ది సమయంలో ఆపరేషన్లకు సిద్ధం కావాలి. ప్రస్తుత పరిస్ధితుల్లో దాయాది దేశంతో పెద్ద ప్రమాదం పొంచి వుంది. అతి కొద్ది రోజుల్లో అందుబాటులో ఉన్న వనరులతో ఆపరేషన్స్కు దిగాల్సిన పరిస్ధితి ఉంది. ఇందుకోసం మీరందరూ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. ట్రైయినింగ్లో అందుకు తగిన విధంగా తర్పీదు పొందాలి..' ఇదీ భారతీయ వాయుదళాధిపతి బీఎస్ ధనోవా భారత వాయు సేన(ఐఏఎఫ్)లో పని చేసే 12 వేల మంది అధికారులకు నెల రోజుల క్రితం రాసిన లేఖ సారాంశం.
అందుబాటులో ఉన్న వనరులతో...
భారత వాయుసేనలో మొత్తం 42 స్వాడ్రన్లకు అనుమతి ఉన్నా.. కేవలం 33 స్వాడ్రన్లకు సరిపడే విమానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న వనరులతో ఆపరేషన్స్కు దిగాలని అధికారులను లేఖ ద్వారా ధనోవా కోరారని నిపుణులు చెబుతున్నారు. జరగబోయే దాన్ని ఆపలేం.. ప్రొఫెషనల్గా వ్యవహరించి యుద్ధానికి సిద్ధం కావాలని కోరడంలో ఉన్న ఆంతర్యం ఇదేనని అన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం శత్రువును కూడా బలంగా మార్చిందనే విషయాన్ని మర్చిపోకూడదని, అప్పుడే విజయం సాధించగలమనే ధనోవా సూచనను ఆయన దూరదృష్టికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.
ఆ రెండు విషయాల్లో జాగ్రత్త...
యుద్ధానికి సంబంధించిన విషయాలనే కాకుండా.. ఇండియన్ ఎయిర్ఫోర్స్ను పీడిస్తున్న రెండు విషయాలను కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా తన లేఖలో ప్రస్తావించారట. అవి ఒకటి ఫేవరేటిజం, రెండు లైంగిక వేధింపులు. ప్రత్యేక ఆపరేషన్స్కు అధికారుల ఎంపికలో నిజాయితీ కనిపించడం లేదని ఆయన తన లేఖలో ఆవేదనను వెలిబుచ్చారు. సీనియర్లు జూనియర్లను ప్రోత్సహించాలే తప్ప వేధించకూడదని, అది భారత వాయుసేనకు ఎంతమాత్రం సహాయపడదని, ఈ రెండూ ప్రొఫెషనలిజాన్ని దెబ్బతీస్తాయని.. ప్రొఫెషనలిజం దెబ్బతిన్న చోట గెలుపు ఉండదని కూడా ఆయన తన లేఖలో వ్యాఖ్యానించారు.