ధనాధన్ 'ధనోవా'.. ఉగ్రశిబిరాలపై దాడుల్లో ఆయనే కీలకమా?
ఢిల్లీ : దాయాదికి చుక్కలు చూపించింది భారత సైన్యం. 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకుంటే చూస్తూ కూర్చుంటామా అనే రీతిలో జవాబిచ్చింది. శాంతి శాంతి అని కూర్చుంటే.. కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతున్న టెర్రరిస్టుల అంతం చూసి పాకిస్థాన్ కు అశాంతి మిగిల్చింది. సాహసోపేతమైన దాడికి పథక రచన చేసి గురి చూసి దెబ్బ కొట్టింది. వాయుసేన దెబ్బకు గిలగిలా కొట్టుకుంటోంది పాకిస్థాన్. అయితే పాక్ ఉగ్రవాదుల మీద పకడ్బందీ దెబ్బ కొట్టిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెనుక దళాధిపతి బీఎస్ ధనోవా కృషి అసామాన్యం, అనిర్వచనీయం.
పక్కా టార్గెట్.. ధనోవా రూటే సెపరేటు
తొందరపాటు లేదు, అలాగని ఆలస్యం చేయలేదు. పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో వాయుసేన దళాధిపతి బీఎస్ ధనోవా తీరిది. పాకిస్థాన్ ఉగ్రవాదులు కొట్టిన దొంగ దెబ్బకు సరైన ప్రతీకారం తీర్చుకున్నారు. నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేయాలంటే ఆషామాషీ కాదు. అదే సందర్భంలో భారత సైన్యానికి ఏమీ జరగకూడదు. ఇదంతా కూడా పకడ్బందీ ప్రణాళికతో వ్యూహరచన చేశారు ధనోవా.
భారత్ పై కన్నేస్తే ఫలితం ఏవిధంగా ఉంటుందో జస్ట్ రుచి చూపించారు ధనోవా. పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడానికి పక్కా స్కెచ్ అమలు చేశారు. తాను ముందుండి వాయుసేనను సరైన ట్రాక్ లో నడిపించారు. ప్రతీకారమంటే ఏమిటో దాయాది దేశానికి అర్థమయ్యే రీతిలో ప్లాన్ వేశారు. వైమానిక దాడుల ప్రణాళికను మొదట కేంద్ర ప్రభుత్వానికి అందించారు. గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కదనరంగంలోకి కాలుమోపారు. సమర్థవంతంగా దాడులు జరిపి విజయవంతంగా ఆపరేషన్ ముగించారు. ధనోవాకు ఉన్న అపారమైన అనుభవం ఈ ఆపరేషన్ లో మస్తుగా ఉపయోగపడింది.
37 ఇయర్స్ ఇండస్ట్రీ.. గోలీమార్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో బీఎస్ ధనోవా పనితీరు ప్రశంసనీయం. సరికొత్త వ్యూహాలతో శత్రుమూకలకు భయం పుట్టించేలా దాడులకు ప్లాన్ చేస్తారనే పేరుంది. వాయుసేనలో 37 ఏళ్ల సుదీర్ఘ అనుభవమున్న ధనోవా.. నైట్ స్ట్రైక్ మిషన్స్ లో స్పెషలిస్ట్. ఇంతకుముందు కూడా పలుమార్లు రాత్రి సమయాల్లో జరిపే దాడుల్లో ఆయన పాలుపంచుకున్నారు.
1999 నాటి కార్గిల్ యుద్ధ సమయంలోనూ ఓ ఫైటర్ స్క్వాడ్రన్కి బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి వైమానిక దళాధిపతి టిప్నిస్ సమన్వయంతో పనిచేసిన ధనోవా శభాష్ అనిపించుకున్నారు. విధినిర్వహణలో నిక్కచ్చిగా బాధ్యతలు నిర్వహిస్తారనే పేరున్న ధనోవా.. అనుకున్న పని పూర్తిచేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు.
సేవలు అసామాన్యం.. విశిష్ట పతకాలు
ఉగ్రదాడులను తిప్పికొట్టాలన్నా.. టెర్రరిస్టులను ఏరివేయాలన్నా నిరంతర సాధన అవసరమవుతుంది. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే త్రివిధ దళాల సిబ్బంది కనురెప్ప మూయకుండా డ్యూటీలు చేస్తుంటారు. అయితే వాయుసేకు దళాధిపతిగా ఉన్న ధనోవా సైతం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటారనే పేరుంది. 37 ఏళ్ల సర్వీసులో అనేక హోదాల్లో దేశానికి సేవలందించారు. ఓ ఫైటర్ బేస్ స్టేషన్ కు కమాండర్ గా, భారత మిలిటరీ ట్రైనింగ్ బృందానికి బాధ్యుడిగా వ్యవహరించారు. ధనోవా సేవలకు ఎన్నో పతకాలు దాసోహమన్నాయి. యుద్ధ సేవా పథకం, వాయుసేన పతకం, అతి విశిష్ట్ సేవా పతకం లాంటివి ఆయన కెరీర్ కు మైలురాయి.