మంత్రి గారి మాట: ఆటోలో కంటే విమానంలోనే ప్రయాణించడం ఉత్తమం అట..!
ఆటోలో ప్రయాణించడం కన్నా విమానంలో ప్రయాణించడం చాలా మేలు. ఈ మాటలు అనింది ఎవరో కాదు, పౌర విమానాయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా. దీని వెనక ఉన్న మర్మం కూడా ఆయన వివరించారు. ఆటో రిక్షాలో ప్రయాణిస్తే కిలోమీటర్కు రూ.5 చెల్లించాల్సి ఉంటుందని అదే విమానంలో ప్రయాణిస్తే కిలోమీటరుకు రూ.4 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు.
"ఈ రోజు విమానధరలు ఆటో రిక్షా ఛార్జీలకంటే తక్కువగా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అని మీరు అడగొచ్చు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఆటోలో ప్రయాణిస్తే వారు చెల్లించాల్సింది రూ.10. అంటే కిలోమీటరుకు రూ.5 అదే విమానంలో ప్రయాణిస్తే రూ.4 మాత్రమే కిలోమీటరుకు చెల్లించాల్సి ఉంటుంది "అని సిన్హా అన్నారు. తర్వాత తన వ్యాఖ్యలపై మరింత వివరణ ఇచ్చారు. నేటి విమానా ఛార్జీలు చాలా తక్కువగా ఉందని చెప్పేందుకే ఆటో ఛార్జీలతో పోల్చినట్లు ఆయన చెప్పారు. కిలోమీటర్కు అయ్యే ఖర్చు ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత విమానాయాన ఛార్జీలే తక్కువగా ఉన్నాయన్నారు.
ప్రపంచంలోని దేశీయవిమానయాన రంగంలో భారత్ వేగంగా దూసుకెళుతోంది అని చెప్పిన సిన్హా.. ఇప్పటికీ విమానాయాన రంగం ఇబ్బందుల్లోనే ఉందని తెలిపారు. గత 50 నెలలుగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నప్పటికీ లాభాల బాటలో మాత్రం నిలుదొక్కుకోవడంలో విమానాయాన సంస్థ విఫలమవుతోందన్నారు. విమానంలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపిన సిన్హా... ప్రస్తుతం విమాన ప్రయాణికుల సంఖ్య 11 కోట్లు ఉందని... ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా అది 20కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.