ఐఎస్ఐ హనీట్రాప్లో ఎయిర్ఫోర్స్ మాజీ అధికారి: అరెస్ట్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ(ఐఎస్ఐ)కి గూఢచర్యం చేస్తున్న భారత ఎయిర్ఫోర్స్ మాజీ అధికారిని పంజాబ్లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు రంజిత్సింగ్ అనే మాజీ అధికారి సమాచారం అందిస్తున్నాడని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రంజిత్ సింగ్ గతంలో భారత వైమానిక దళంలో పనిచేస్తూ సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన తర్వాత అతడు ఐఎస్ఐకు గూఢచర్యం చేస్తున్నాడనే అనుమానంతో పోలీసులు రక్షణ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు. అతడి చర్యలపై అనుమానంతో సోమవారం అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న భారత ఎయిర్ఫోర్స్ స్టేషన్లో విధులు నిర్వహించిన రంజిత్.. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ మహిళకు భారత రక్షణకు సంబంధించిన పలు విషయాలను చేరవేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.
జమ్మూకు చెందిన ఆ మహిళకు గత మూడు నెలలుగా రంజిత్ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారం చేరవేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే ఐఎస్ఐకి సమాచారం చేరవేస్తున్న ఓ మాజీ సైనికాధికారిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడ్ని కూడా పోలీసులు విచారిస్తున్నారు.