వాయుసేన,నేవీ దళాధిపతులకు సెక్యూరిటీ పెంపు..జెడ్ ప్లస్ క్యాటగిరీలో ధనోవా, సునీల్లాంబా
ఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతవాయుసేన, నేవీ అధిపతులకు భద్రతను పెంచాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం దేశ అంతర్గత భద్రతపై హోంశాఖ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ఫోర్స్, నేవీ దళాధిపతులకు ఇకపై జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీచేయడం జరిగిందని కేంద్ర హోంశాఖ తెలిపింది.
కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ బీరేందర్ సింగ్ దనోవా, నేవీ ఛీఫ్ సునీల్ లాంబాలకు ఢిల్లీ పోలీసులు జెడ్ ప్లస్ సెక్యురిటీని కల్పించనున్నారు. ఇక ఆర్మీ ఛీఫ్కు ఇప్పటికే సరిపడా భద్రత ఉన్నందున ఎయిర్ ఫోర్స్, నేవీ దళాధిపతులకు సెక్యూరిటీ పెంచాలని భావించినట్లు కేంద్రం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఇక జెడ్ ప్లస్ భద్రత ఉన్నవారికి ఆ కేటగిరీలో 55 మంది రక్షణగా ఉంటారు. ఇందులో 10 నేషనల్ సెక్యూరిటీ గార్డు కమాండోలు ఉంటారు. ఎన్ఎస్జీ కమాండోలు అత్యంత ఆధునిక ఆయుధాలను కలిగి ఉంటారు. ఇందులో ఎంపీ5 గన్లు ఇతర సమాచార వ్యవస్థ కలిగిన గ్యాడ్జెట్లను తమ వద్ద ఉంచుకుంటారు.
దేశంలోని పలువురు వీఐపీలకు జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వడం జరుగుతుంది. ఫలానా వీఐపీకి ప్రాణహాని ఉందని తెలిస్తే ప్రభుత్వం వారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 మంది వీఐపీలకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పిస్తోంది. ఇందులో ములాయం సింగ్ యాదవ్, మాయావతి, అఖిలేష్ యాదవ్, చంద్రబాబు నాయుడు, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ప్రకాశ్ సింగ్ బాదల్, ఎల్కే అద్వానీ, రాజ్నాథ్ సింగ్, యోగీ ఆదిత్యానాథ్లకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పిస్తోంది.