గాల్లో ప్రాణాలు: పేలిన ఎయిర్ ఇండియా విమానం టైరు
ముంబై: ముంబై విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. నాగ్పూర్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయంలో రన్ వేపై ల్యాండ్ అవుతుండగా దాని టైరు పేలింది. ఈ సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే పెను ప్రమాదం తప్పడంతో విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... నాగ్పూర్ నుంచి వచ్చిన ఎయిర్బస్ ఎ320 విమానం రన్ వేపై దిగుతుండగా దాని టైరు పేలిపోయింది. ఈ సమయంలో చోటు చేసుకున్న కుదుపులకు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. దాంతో విమానాన్ని టాక్సీవే వద్దకు తీసుకెళ్లి, అక్కడ ఎమర్జెన్సీ విండో ద్వారా ప్రయాణికులందరినీ దించేసినట్లు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్రయాణికులందరినీ విమానంలో నుంచి దించేసిన తర్వాత విమానాన్ని టాక్సీవేలోకి తరలించారు. అయితే ఈ ఘటన జరిగిన కారణంగా ముంబై విమానాశ్రయంలోని ప్రధాన రన్వేను మూసేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
#Visuals of the Air India flight whose burst last night at Mumbai airport during landing. pic.twitter.com/oMWRjmJrna
— ANI (@ANI_news) 16 March 2016