Gandhi Jayanti:మహాత్ముడి చిత్రంతో ఎయిరిండియా, భారత రైల్వే ఘన నివాళులు
ఢిల్లీ: ప్రభుత్వరంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఎయిర్బస్ ఏ320పై గాంధీజీ బొమ్మను ముద్రించారు. మహాత్ముడి చిత్రాన్ని విమానం తోక భాగంలో వేశారు. ఈ ప్రత్యేక విమానం న్యూఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంకు ప్రయాణికులను మోసుకెళుతుంది. గాంధీ చిత్రం 11 అడుగులు బై 4.9 అడుగులు ఉంది.
మహాత్మాగాంధీ 'తెలివైన వ్యాపారి’ అన్న అమిత్ షా.. మండిపడిన కాంగ్రెస్
ఎయిర్బస్ పై గాంధీ చిత్రం
ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్బస్ ఏ 320 విమానం పై గాంధీ చిత్రాన్ని వేశారు. ఢిల్లీ నుంచి ముంబైకి తొలి ప్రయాణం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబై చేరుకుంది. మహాత్ముడి 150 జయంతి వేడుకల సందర్భంగా ఇలాంటి ప్రత్యేకమైన విమానంలో ప్రయాణించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఇందులో ప్రయాణించిన ప్రయాణికులు చెప్పారు. ఒక విమానంపై శాశ్వతంగా జాతి పిత గాంధీ బొమ్మను చిత్రీకరించడం ద్వారా ఆయన 150వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించినట్లయ్యిందని ఎయిరిండియా ప్రతినిధి ధనుంజయ్ కుమార్ చెప్పారు.
15 రోజుల్లో మరో ఐదు విమానాలకు..
ఈ విమానంపై మహాత్ముడి చిత్రాన్ని చిత్రీకరించేందుకు సంబంధిత అధికారుల నుంచి శాఖలనుంచి అన్ని ముందస్తు అనుమతులు పొందినట్లు ధనుంజయ్ వెల్లడించారు. రానున్న 15 రోజుల్లో ఎయిరిండియా సంస్థలో ఉన్న బోయింగ్, బీ747, బీ787,బీ777, ఎయిర్బస్ ఏ 320, మరియు ఏటీఆర్లపై గాంధీ లోగోను ముద్రిస్తామని ఎయిరిండియా ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అశ్వనీ లోహానీ తెలిపారు.ఇలా మొత్తం ఐదు విమానాలపై ముద్రిస్తామని వివరించారు.
22 రైలింజన్లపై గాంధీ చిత్రం
ఇదిలా ఉంటే భారతీయ రైల్వేలు కూడా జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాయి. రైలు ఇంజిన్లపై గాంధీజీ పెయింటింగ్ను రైల్వేశాఖ వేసి నివాళులు అర్పించింది. ఇది సెంట్రల్ రైల్వే జోన్ చేసింది. మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించే భాగంగా.. 22 రైలు ఇంజిన్లపై గాంధీ ముద్ర వేసినట్లు వెల్లడించింది రైల్వే శాఖ. 2 నెలల ముందు నుంచే ఈ కార్యక్రమం చేపట్టినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.