వృద్దులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిరిండియా: 50 శాతం రాయితీ అందుకోండిలా..
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఎయిర్ ఇండియా వృద్ధ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు తమ టికెట్ రుసుములో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇది కేవలం దేశీయ విమానాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Recommended Video
ఈ మేరకు ఎయిరిండియా తన వెబ్సైట్లో వివరాలను వెల్లడించింది. భారతీయులై ఉండి, భారతదేశంలో నివసిస్తున్న 60 ఏళ్లకు పైబడిన వారు ఈ ఆఫర్కు అర్హులని పేర్కొంది. ప్రయాణం చేసే నాటికి వారికి 60 ఏళ్లు ఉండాలని తెలిపింది. ఈ రాయితీ కేవలం టికెట్ రుసముపైనే కాకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిలి ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించిన అన్ని రుసుములకూ కలిపే 50 శాతం రాయితీ అని తెలిపింది.
టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికులు వారి గుర్తింపు కార్డును అనుసరించి వయసును నమోదు చేసుకోవాలని సూచించింది. వీటిలో ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎయిరిండియా జారీ చేసిన సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులు అనుమతిస్తామని పేర్కొంది.
ప్రయాణికులు ఈ రాయితీని ఉపయోగించుకుని దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లొచ్చని తెలిపింది. అయితే, మూడు రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కాగా, తనిఖీ సమయంలో సరైన గుర్తింపు కార్డులు సమర్పించకపోతే టికెట్ పూర్తి రుసుమును చెల్లించాల్సి ఉంటుందని ఎయిరిండియా స్పష్టం చేసింది.