ఎయిరిండియా ఉద్యోగులకు షాక్: ఆ ప్రతిపాదనలకు బోర్డు క్లియరెన్స్: 6 నెలల నుంచి అయిదేళ్ల వరకూ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా.. తన ఉద్యోగులకు హైఓల్టేజీ షాక్ ఇచ్చింది. కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను కుదించే ప్రయత్నాలకు తెర తీసింది. ఇప్పటికే వారి వేతనాల్లో కోత పెట్టిన ఎయిరిండియా.. మరో కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. సంస్థలో మిగులు ఉద్యోగులను పరోక్షంగా తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వారిని వేతనాలు లేని సెలవులపై పంపించబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఎయిరిండియా ఆమోదం తెలిపింది. ఫలితంగా- ఓ మోస్తరు సంఖ్యలో ఉద్యోగులు తమ విధులకు దూరం కానున్నారు.
ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు
ఎయిరిండియా బోర్డు తాజాగా ఆమోదించిన ప్రతిపాదనల ప్రకారం.. మిగులు ఉద్యోగులను దశలవారీగా తప్పనిసరి సెలవుల్లోకి పంపిస్తారు. సెలవుల కాల పరిమితి ఆరు నెలల నుంచి అయిదు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ కాలంలో వారు ఎయిరిండియా ఉద్యోగులుగానే పరిగణిస్తారు. సెలవు కాలంలో వారికి ఎలాంటి వేతనాలను గానీ, ఇతరత్రా అలవెన్సులను గానీ చెల్లించదు ఎయిరిండియా. సంస్థ అవసరానికి అనుగుణంగా వారందరినీ విధుల్లోకి తీసుకుంటారు.
కరోనా వల్ల సంక్షోభంలో..
ఇప్పటికే ఎయిరిండియాపై అమ్మకపు కత్తి వేలాడుతోంది. ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి ఉంచింది. పెట్టుబడుల ఉపసంహరణ జాబితాలో ఉంది ఎయిరిండియా. సంస్థ నష్టాల్లో కూరుకునిపోయిందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్కు పూనుకుంది. ఇందులో పెట్టుబడులు పెట్టడానికి కొన్ని ప్రైవేటు పౌర విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అవి ఇంకా కొలిక్కి రాలేదు. దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతూనే వస్తోంది. అదే సమయంలో కరోనా వైరస్ సంక్షోభం తలెత్తడంతో ఇక ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరుకుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
లాక్డౌన్ ప్రభావం వల్ల
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అసలే ఆర్థికంగా అంతంతమాత్రంగా నెట్టుకొస్తోన్న ఎయిరిండియాపై లాక్డౌన్ పెను ప్రభావాన్ని చూపించింది. లాక్డౌన్ కొనసాగినన్ని రోజులూ ఎయిరిండియా విమాన సర్వీసులు అందుబాటులోకి రాలేదు. ఏ ఒక్క విమానం కూడా గాల్లోకి ఎగరలేదు. లాక్డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకుని పోయిన భారతీయులను స్వదేశానికి చేర్చడానికి మాత్రమే పరిమితంగా ఎయిరిండియా విమాన ర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
ఆర్థిక ఊబిలోకి మరింత..
ఈ పరిణామాలతో ఎయిరిండియా మరింతగా ఆర్థిక ఊబిలోకి చిక్కుకునిపోయింది. లాక్డౌన్ వల్ల సర్వీసులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఉద్యోగులు వేతనాలు, విమానాల నిర్వహణ తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను కుదించే ప్రయత్నాలకు తెర తీసింది. ఇందులో భాగంగా- మిగులు ఉద్యోగులను ఆరు నెలల నుంచి అయిదేళ్ల లోపు సెలవుల్లో పంపించే ప్రతిపాదనలను రూపొందించింది. తాజాగా దీనికి ఎయిరిండియా బోర్డు ఆమోదం తెలిపింది.
Recommended Video
మిగులు ఉద్యోగులను గుర్తించడానికిి కమిటీ..
ఎయిరిండియాలో మిగులు ఉద్యోగులను గుర్తించడానికి బోర్డు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వచ్చేనెల 11వ తేదీన తన నివేదికను బోర్డుకు అందజేయనుంది. ఆ తరువాతే ఉద్యోగులను వేతనాలు లేని సెలవుల్లోకి పంపించే ప్రక్రియ ఆరంభమౌతుందని అంటున్నారు. ఇలా ఎంతమందిని వేతనాలు లేని సెలవుల్లోకి పంపిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ కమిటీ దీనికి సంబంధించిన వివరాలను అందజేస్తుంది. వచ్చేనెల 11వ తేదీన దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెబుతున్నారు.