చరిత్ర సృష్టించిన ఎయిరిండియా: ఎయిర్బస్ను మోసుకెళ్లిన ట్యాక్సీబాట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా మంగళవారం చరిత్ర సృష్టించింది. విమానంలో ప్రయాణికులు ఉండగానే పార్కింగ్ స్థలం నుంచి రన్వే వరకు ఎయిరిండియా ఎయిర్బస్ ఏ 320ని ట్యాక్సీ బాట్ సాయంతో తీసుకొచ్చారు. ప్రపంచంలోనే ఇలా ఒక ట్యాక్సీబాట్తో భారీ విమానంను రన్వేపైకి తీసుకురావడం తొలిసారి అని అధికారులు తెలిపారు.
ఇజ్రాయిల్లో తయారైన ట్యాక్సీ బాట్
ట్యాక్సీబాట్ను ఇజ్రాయిల్కు చెందిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ ఫ్రాన్స్ కంపెనీతో కలిసి తయారుచేసింది. ట్యాక్సీ బాట్ అంటే ట్యాక్సీ రాబోట్ అని అర్థం. ఇది పైలట్ నియంత్రణలో ఉండే సెమీ రాబోటిక్ ఎయిర్క్రాఫ్ట్ ట్రాక్టర్. పార్కింగ్ చోటులో ఉండే విమానంను రన్వేవరకు తీసుకొస్తుంది. ఢిల్లీ నుంచి ముంబైకు వెళ్లే ఎయిరిండియా విమానం ఏఐ665ను ట్యాక్సీబాట్ పార్కింగ్ చోటనుంచి రన్వేకి తీసుకెళ్లింది. ఎయిరిండియా ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అశ్వనీ లోహానీ జెండా ఊపి ప్రారంభించారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక విమానంను టాక్సీబాట్ ద్వారా రన్వే వరకు తీసుకురావడం ప్రపంచంలో తొలిసారని చెప్పారు అశ్వనీ లోహానీ. పర్యావరణ పరిరక్షణలో పెద్ద అడుగుగా ఆయన అభివర్ణించారు.
ట్యాక్సీబాట్లతో లాభాలు ఇవే..!
ఇక ట్యాక్సీ బాట్ వినియోగం వల్ల ఇంధనం ఆదా అవడమే కాకుండా ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లో భాగాలు కూడా పాడవకుండా ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో విమానం ఇంజిన్ కూడా ఆన్ అవదు. రన్వేపైకి విమానం చేరుకోగానే ఇంజిన్ను పైలట్ ఆన్ చేస్తారు.అయితే ట్యాక్సీ బాట్లను కేవలం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరే విమానాలకే వినియోగిస్తారు. ట్యాక్సీబాట్ల వినియోగం ద్వారా గాల్లోకి కార్బన్ ఉద్గారాల విడుదలకు ఎయిరిండియా అడ్డుకట్ట వేయగలిగిందని చెప్పొచ్చు.
ట్యాక్సీబాట్లతో పర్యావరణంకు మేలు
ట్యాక్సీ బాట్ల ద్వారా ఇంధనం వినియోగం దాదాపు 85శాతం తగ్గుతుంది. విమానాల ఆపరేషన్లు నిర్వహిస్తూనే పర్యావరణ పరిరక్షణకు కూడా చర్యలు తీసుకున్నట్లయ్యిందని ఎయిరిండియా అభిప్రాయపడింది. కొద్దిరోజుల క్రితమే పోలార్ రూట్లలో శాన్ఫ్రాన్సిస్కోకు ప్రయాణించి ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటుగా ఇంధనంను కూడా ఆదా చేసిన తొలి భారతీయ ఎయిర్లైన్స్గా ఎయిరిండియా రికార్డు సృష్టించింది. మొత్తానికి అప్పుల్లో ఉన్నప్పటికీ ఎయిరిండియా మాత్రం ఎప్పటికీ ఎవర్గ్రీనే అని ట్యాక్సీబాట్ల వినియోగం ద్వారా మరోసారి నిరూపితమైంది.