ఎయిర్ ఇండియా: ప్రయాణికుడి భోజనంలో బల్లి
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి ఇచ్చిన భోజనంలో బల్లి పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దెబ్బతో ఎయిర్ ఇండియా మీద ఇంకోక సారి ఆరోపణలు రావడంతో అధికారులు సతమతం అయ్యారు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గురువారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎయిర్ ఇండియా విమానం ఎఐ 111 లండన్ బయలుదేరింది. తరువాత అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి సిబ్బంది భోజనం ఇచ్చారు.
ఆహారం ఇచ్చిన ట్రేలో బల్లి కనిపించింది. షాక్ కు గురైన ఆ వ్యక్తి ఎయిర్ ఇండియా సిబ్బందిని పిలిచి బల్లి పడిందని ప్లేట్ వేరే ఇవ్వాలని చెప్పాడు. అయితే సిబ్బంది మాత్రం వేరే ప్లేట్ ఇవ్వడానికి నిరాకరించారని, తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రయాణికుడు ఆరోపించారు.
ఈ విషయంపై తాను ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని ప్రయాణికుడు అన్నారు. అయితే ఎయిర్ ఇండియా వాదన మరో విధంగా ఉంది. ప్రయాణికుడికి ఇచ్చిన భోజనం లో బల్లి లేదని, ఆ అవకాశం లేదని అంటున్నారు. తమకు ఎవ్వరు కూడా ఫిర్యాదు చెయ్యలేదని ఎయిర్ ఇండియా అధికారులు అంటున్నారు.