కోజికోడ్ క్రాష్: ముక్కలైన విమానం - భయానక దృశ్యాలు - కెప్టెన్ సాథే మాజీ ఐఏఎఫ్ - మోదీ కీలక ఆదేశాలు
కోజికోడ్ : కేరళలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 15 మంది చనిపోయిన కొద్ది సేపటికే.. కాలికట్లో ఘోర విమన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పైలట్, కో-పైలట్ ఇద్దరూ మృతి చెందారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నలుగురు ప్రాణాలు కోల్పోగా, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. భారీ వర్షాల కారణంగా రన్వే సరిగ్గా కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ల్యాండింగ్ కు రెండో ప్రయత్నంలో విమానం పట్టుతప్పి పక్కనున్న లోయలోకి దూసుకుపోయింది.
Recommended Video
పినరాయితో మాట్లాడిన ప్రధాని మోడీ
ఇదిలా ఉంటే విమానం స్కిడ్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. కేరళ సీఎం పినరాయి విజయన్తో ప్రధాని మోడీ మాట్లాడారు. ఘటన గురించి కేరళ సీఎం పినరాయి విజయన్ వివరించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పినరాయి విజయన్ చెప్పారు. కేరళ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ప్రమాదం దురదృష్టకరమని మోడీ చెప్పారు.
ప్రమాదం దురదృష్టకరం
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అమిత్ షా వెంటనే ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఇదిలా ఉంటే వందేభారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్కు బయలుదేరిన ఈ ఎయిరిండియా విమానం కోజికోడ్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో పక్కకు జారింది. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 7:40 గంటలకు చోటుచేసుకుంది.
కొండప్రాంతంలో ఉన్న విమానాశ్రయం
ఇక ఈ విమానాశ్రయం కొండప్రాంతంలో ఉంది. దేశంలో కొండప్రాంతాల్లో ఉన్న మూడు విమానాశ్రయాల్లో ఇదొకటి. ఈ విమానం 35 అడుగుల లోతుకు పడిపోయినట్లు డీజీసీఏ తెలపింది. మరోవైపు విమానం క్రాష్ కాగానే మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ఇందులో పైలట్ కూడా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన పైలట్ను కెప్టెన్ దీపక్ సాథేగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే చాలామంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విమాన ప్రమాదం గురించి తెలుసుకునేందుకు ఎమర్జెన్సీ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అంతేకాదు 04832719493 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని డీజీసీఏ తెలిపింది.
ఆయన సీనియర్మోస్ట్ పైలట్
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో పైలట్ కెప్టెన్ డీవీ సాథే తోపాటు కో పైలట్ కూడా మృతి చెందారు. కెప్టెన్ సాథే గతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోనూ పని చేశారు. దేశంలో సీనియర్మోస్ట్ పైలట్ గా ఆయనకు పేరుంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 191 మంది ఉన్నారు. వీరిలో 174 మంది ప్రయాణికులు ఉండగా 10 మంది పిల్లలు నలుగురు సిబ్బంది ఇద్దరు పైలట్లు ఉన్నట్లు సమాచారం. ఇక ప్రమాదం జరిగినట్లు సమాచారం అందగానే 24 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్కు తరలించాయి. కరిపూర్లోని రన్వే పై ల్యాండ్ చేసే సమయంలో పైలట్లు చాలా చాకచక్యంతో వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది కొండపై ఉన్న విమానాశ్రయం అని అలాంటప్పుడు చాలా జాగ్రత్తతో వ్యవహరించాలని చెబుతున్నారు.