కోజికోడ్ విమానాశ్రయం: ఎయిరిండియా విమానం క్రాష్, పైలట్ సహా 19మంది మృతి, పలువురికి గాయాలు
తిరువనంతపురం: కోజికోడ్ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్-కోజికోడ్ వచ్చిన విమానం కోజికోడ్ విమానాశ్రయంలో క్రాష్ అయ్యింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో విమానం పైలట్, కో-పైలట్ తోపాటు 19 మంది మరణించారు.
45 మంది పరిస్థితి విషమం..
అంతేగాక, విమానంలోని 191 మంది ప్రయాణికుల్లో అనేక మంది గాయాలపాలయ్యారు. అయితే, విమానంలో మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విమానంలోని ప్రయాణికులందర్నీ బయటికి తీసి ఆస్పత్రులకు తరలించారు. 45 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీసులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Recommended Video
ప్రమాదానికి కారణం అదే..
ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానాన్ని ఐఎక్స్ 344గా గుర్తించారు. విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందేభారత్ మిషన్లో భాగంగా ఈ విమానం నడుస్తోంది. శుక్రవారం సాయంత్రం 7గంటల 5 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, పైలట్ దీపక్ వసంత్ సాథే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావడం గమనార్హం. అంతేగాక, ఆయన వాయుసేనలో కూడా ఆయన పనిచేశారు. విమానంలో వర్షపు నీరు చేరుకున్న కారణంగా సరిగా రన్ వే కనిపించకపోవడంతో ఎయిరిండియా విమానం క్రాష్ అయ్యిందని, ఆ తర్వాత రెండుగా ముక్కలైందని ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది.
డీజీసీఏ విచారణ.. హెల్ప్లైన్ నెంబర్లు..
విమానంలో 191 మంది ఉన్నారని తెలిపింది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా రన్ వేపై నీరు చేరడంతో విమానం స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. బోయింగ్ విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోజికోడ్ విమాన ప్రమాదం : హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల 0543090572, 543090575, 0565463903, 0543090572