రేణుకా చౌదరి షాపింగ్: కేంద్రమంత్రి, జడ్జి ఉన్న విమానం 45ని.లు ఆగింది
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్ 45 నిమిషాలు ఆగింది. రేణుకా చౌదరి షాపింగ్ సరదా ఈ విమానాన్ని అంత సేపు విమానాశ్రయంలోనే నిలిచేలా చేసింది. దీంతో ప్రయాణికులలో కూర్చున్న కేంద్ర మంత్రి ఒకరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సదరు నాయకురాలు ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూడక తప్పలేదు.
గత శుక్రవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగిన ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ మీదుగా చికాగో నుంచి హైదరాబాద్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం సాయంత్రం 7 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఒక ప్రయాణికురాలు ఆలస్యంగా రావడంతో 45 నిమిషాలు ఆలస్యంగా విమానం గాల్లోకి లేచింది.
ఇంతకీ షాపింగ్లో మునిగిపోయి విమానం ఆలస్యంగా బయలుదేరడానికి కారణమైన నాయకురాలు ఎవరా అని అందరు అనుకున్నారు. ఆమె కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే రేణుకా చౌదరి ఈ ఆరోపణలను ఖండించారు. ప్రయాణికులను విమానాశ్రయం నుంచి విమానం దగ్గరికి చేర్చేందుకు ఉద్దేశించిన బండి మూలంగానే ఆలస్యమైంది తప్ప తను షాపింగ్ చేయలేదన్నారు. కొందరు కావాలనే తన పైన బురద జల్లుతున్నారన్నారు. తాను షాపింగ్ చేసినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. కాగా, ఆలస్యం పైన ఎయిర్ ఇండియా విమానం విచారణకు ఆదేశించింది.