గాల్లో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు !
ముంబై: ముంబై నుంచి అమెరికా బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలోని కార్గో విభాగంలో మంటలు వ్యాపించినట్లు అలారం రావడంతో దాన్ని దారిమళ్లించారు. కజకిస్థాన్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఈ విమానంలో ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని, విమానాన్ని ఇంజనీర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. విమానంలో ఇప్పటి వరకు మంటలు కాని, పొగ కాని కనిపించలేదని అధికారులు అన్నారు.
గురువారం వేకువ జామున 2.25 గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానం టేకాఫ్ అయ్యింది. అమెరికాలోని నెవార్క్ కు బయలుదేరిన ఈ విమానాన్ని గురువారం ఉదయం 8 గంటలకు కజకిస్థాన్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
కార్గో విభాగంలో ఉండే కొన్ని వస్తువుల కారణంగా అలారం వచ్చే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. సాంకేతిక పరంగా కొన్ని అనుమతులు వచ్చిన తరువాత విమానాన్ని నెవార్క్ కు పంపాలా ? వద్దా ? అని నిర్ణయిస్తామని అన్నారు.
అత్యవసరం అయితే ప్రయాణికులను తరలించడానికి ఢిల్లీ విమానాశ్రయంలో మరో విమానం సిద్దంగా ఉందని, ఆపరేషనల్ కారణాల వలనే బోయింగ్ 777 విమానాన్ని దారి మళ్లించామని ఎయిర్ ఇండియా ఓ ట్వీట్ లో పేర్కొంది.